- వడదెబ్బకు గురికాకుండా ముందస్తు చర్యలతో హెల్త్ పదిలం
- వృద్ధులు, చిన్నారులపై స్పెషల్ ఫోకస్ తప్పనిసరి
వేద న్యూస్, జమ్మికుంట:
రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏప్రిల్ మాసంలోనే మే నెల నాటి ఎండలు తలపిస్తుండటంతో జనం బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎండవేడిమికి ఇంటిలోనే ఉక్కపోతకు గురవుతూ.. ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 9 నుంచే సూర్యుడి ప్రతాపం కారణంగా ప్రజలు దాదాపుగా ఇండ్లలో నుంచి అసలు బయటకు రావడం లేదు. అత్యవసరమైతే వారి పనుల నిమిత్తం వస్తున్నారు. కాగా, ఎండల్లో బయటకు వెళ్లకూడదని, తప్పని సరైతే జాగ్రత్తలు పాటించాలని, లేదంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని వైద్యులు సలహాలిస్తున్నారు.
ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఊడుగుల సురేశ్ పేర్కొన్నారు. ఇంట్లో ఉండే వృద్ధులు, పిల్లలు కూడా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని, వడదెబ్బకు గురైనప్పుడు సరైన చర్యలు తీసుకోకపోతే.. ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వడదెబ్బ గురించి తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ‘వేద న్యూస్’కు ప్రత్యేకంగా వివరించారు. ఆ విషయాలు మీ కోసం..
వడదెబ్బతో పొంచిన ప్రమాదం
వడదెబ్బకు గురైన వారి శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారన్హీట్కు చేరుకుంటుంది. ఎండలో తిరగడం, తక్కువ నీరు సేవించడం, ద్రవ పదార్థాలు తీసు కోకపోవడం, మద్యం సేవించడంతో వడదెబ్బ తగులుతుంది. అధిక ఎండ శరీరానికి తగిలిన కారణంగా శరీరంలోని ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి నీరు ఆవిరై లవణాలు కోల్పోతారు. శరీరం పొడి బారి.. అపస్మారక స్థితికి చేరుకుంటారు. సమయానికి వైద్యం అందకుంటే తీవ్రత పెరిగి శరీరం నిస్తేజమై ప్రాణం పోయే ప్రమాదం ఉంది.
వడదెబ్బ అంటే.. డీహైడ్రేషన్కు సంబంధించిన అనారోగ్యం. ఇందులో హీట్ ఎగ్జాషన్,
హీట్ ఇంజురీ, హీట్ స్ట్రోక్ అనే మూడు రకాలు ఉంటాయి.
హీట్ ఎగ్జాషన్
హీట్ ఎగ్జాషన్లో అధిక ఉష్ణోగ్రతల కారణంగా అలసటగా ఉంటుంది. గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, వేడిగా ఉన్నప్పుడు ఎక్కువగా అలసిపోయినట్లు అనిపిస్తుంది. కండరాల నొప్పి ఉంటుంది.
హీట్ ఇంజురీ
హీట్ ఇంజురీలో శరీర భాగాలు దెబ్బతినే అవకాశం ఉంది. కిడ్నీ, గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
హీట్ స్ట్రోక్
హీట్ స్ట్రోక్ తీవ్రమైన సమస్య.. దీనిలో శరీర భాగాలు తీవ్రంగా దెబ్బతింటాయి. దీని కారణంగా మెదడు పనితీరు దెబ్బతింటుంది. స్ట్రోక్ సంభవించవచ్చు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది.
ఎవరికి రిస్క్ ఎక్కువ..?
వడదెబ్బ రెండు రకాలు ఉంటుంది. మొదటిది క్లాసిక్ హీట్ స్ట్రోక్ , రెండోది ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్. క్లాసిక్ హీట్ స్ట్రోక్ కారణంగా వృద్ధులు ఎక్కువగా ప్రభావితం అవుతారు. ముఖ్యంగా.. డయాబెటిస్, హైపర్టెన్షన్, సిస్టిక్ ఫైబ్రోసిస్, స్లీప్ డిజార్డర్స్, కిడ్నీ, ఊపిరితిత్తులు, మీ శరీర ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసే మందులు వేసుకునే వారికి ఈ వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే లివర్, థైరాయిడ్, రక్తనాళాల సమస్యలు ఉన్నవారు క్లాసిక్ హీట్ స్ట్రోక్కు గురయ్యే అవకాశం ఉంది.
ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ చిన్న వయస్సువారికి సంభవించే అవకాశం ఉంది. తీవ్రమైన వ్యాయామం, క్రీడాకారులు, వేడి వాతావరణంలో శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి, డీహైడేషన్, శరీరం ఒత్తిడికి గురైనప్పుడు, సూర్యరశ్మికి గురైనప్పుడు ఎగ్జాషన్ హీట్ స్ట్రోక్ వస్తుంది.
వ్యక్తి వ్యక్తికి లక్షణాల్లో మార్పు
వడదెబ్బ లక్షణాలు వ్యక్తి వ్యక్తికి మారుతూ ఉంటాయి. ఒళ్లు నొప్పులు, అలసట, కళ్లు తిరగడం, చెమట, అటాక్సియా, మైకము, చర్మం కందిపోవడం, వికారం, వాంతులు, అధిక దాహం, తక్కువ మూత్ర విసర్జన, గుండె వేగంగా కొట్టుకోవడం, మూర్ఛ, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, బ్రెయిన్ వాపు, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, మెటబాలిక్ ఫెయిల్యూర్, నరాల దెబ్బతినడం, గుండెకు రక్త ప్రసరణ తగ్గడం, హార్ట్ ఫెయిల్యూర్, కోమాలోకి వెళ్లడం జరుగుతుంది.
వడదెబ్బను ఎలా నివారించాలి..
డయాబెటిస్, హైపర్టెన్షన్ ఉన్నవారు.. శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మధ్యాహ్నం పూట బయటకు వెళ్లకపోవడం మంచిది. వారి మెడికేషన్ సక్రమంగా తీసుకోవాలి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు బయట తిరగకపోవడమే మంచిది. అత్యవసర పరిస్థితిలో వెళ్లాల్సి వస్తే… తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముదురు రంగు దుస్తులు కాకుండా తేలికపాటి లేత రంగు దుస్తులను ధరించాలి.
ఆల్కాహాల్ శరీరంలోని నీటి శాతాన్ని తగ్గిస్తాయి. ఎండాకాలంలో మద్యానికి దూరంగా ఉండటం మంచిది. ఓఆర్ఎస్, కొబ్బరి నీళ్లు, ఉప్పు కలిపిన నిమ్మరసం లాంటివి శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి భర్తీ చేస్తాయి. దోసకాయలు, పుచ్చకాయలు, దానిమ్మ, బత్తాయి లాంటి పండ్లు తీసుకోవాలి.
వేసవిలో తేలికపాటి వ్యాయామాలు ఉదయం 8 గంటల్లోపే ముగించాలి.
వడదెబ్బ లక్షణాలు కనిపించగానే చికిత్స అందించాలి. లేదంటే శరీరం పూర్తిగా నిర్జలీకరణం చెంది.. బీపీ, పల్స్ పడిపోయి కొన్నిసార్లు ప్రాణాలు పోవచ్చు.
వడదెబ్బకు గురైతే.. ఇలా చేయండి..
ప్రథమ చికిత్సగా మెడ, ముఖంపై ఐస్ ప్యాక్ పెట్టుకోండి. ఎవరికైనా వడదెబ్బ తగిలినపుడు ఆ వ్యక్తిని చల్లని వాతావరణంలోకి తీసుకెళ్లాలి. ఒంటిపై దుస్తులను వదులుగా చేసి గాలి బాగా ఆడేలా చూడాలి. నీరు, ద్రవాహారాలను బాగా అందించాలి. కొబ్బరినీరు, చెరుకు రసాలు, పెరుగు, మజ్జిగ, పళ్లరసాలు వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తాయి. వడదెబ్బ లక్షణాలు తీవ్రంగా ఉంటే.. వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లడం మంచిది.