వేద న్యూస్, వరంగల్ క్రైమ్ : 

ఎన్నికలు సమీపిస్తున్న వేళ  సిబ్బంది అప్రమత్తతో విధులు నిర్వహించాల్సి వుంటుందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లల్లో విధులు నిర్వహిస్తున్న బ్లూకోల్ట్‌ సిబ్బందితో పాటు సెక్టార్‌ విభాగం ఎస్‌.ఐలతో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో  పోలీస్‌ కమిషనర్‌ ముందుగా బ్లూకోల్ట్స్‌ సిబ్బంది నిర్వహించిన విధులపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా పరిశీలించడంతో పాటు వారికి అప్పగించిన విధులు నిర్వహిస్తున్న తీరుతెన్నులపై పోలీస్‌ కమిషనర్‌ ఆరా తీసారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఫిర్యాదు రావడంతో క్షణాల్లో స్పందించాల్సిన బాధ్యత బ్లూకోల్ట్స్‌ సిబ్బందిపై  వుందని వచ్చిన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేసి స్టేషన్‌ అధికారికి పూర్తి నివేదిక అందజేయడం ద్వారా బాధితులకు తగు న్యాయం కలుగుతుందని అన్నారు. తద్వారా ప్రజలకు పోలీసులపై గౌరవం పెరుగుతుందని బ్లూకోల్ట్స్‌ సిబ్బంది తమ పరిధిలో ముందస్తూ సమాచారాన్ని సేకరించాల్సి వుంటుందని అన్నారు. ఇలాంటి ముందస్తూ సమాచారం అధికారులకు చేరవేయడం ద్వారా నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతలను పరిరక్షించుకోవచ్చని ముఖ్యంగా త్వరలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో వుంచుకోని నిబద్దతతో విధులు నిర్వహించాల్సి వుంటుందని, సిబ్బంది పనితీరుపై అధికారుల దృష్టి వుంటుందని తెలియజేసారు. ఈ సమావేశంలో పరిపాలన అదనపు డిసిపి రవి, ఏసిపిలు జితేందర్‌ రెడ్డి, జనార్థన్‌ రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్‌ సంతోష్‌, శ్రీనివాస్‌ రెడ్డి ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.