వేద న్యూస్, ఓరుగల్లు:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 68 వ వర్ధంతిని హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఇంజపెల్లి నరేష్ ఆధ్వర్యంలో మహనీయుడు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సెక్రెటరీ నరేశ్ మాట్లాడుతూ రాజ్యాంగ రూపకల్పనలో, భారత ప్రజలు, మహిళల హక్కుల విషయంలో అంబేడ్కర్ కృషి నిరుపమానమైనదని వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సబ్బండ వర్గాలకు ఆదర్శమని చెప్పారు. అంబేడ్కర్ ఆశయ సాధనలో యువత ముందుకు వెళుతూ విజయాలు సాధించాలని, అంబేద్కర్ ఆశయాలను, వారు కన్న కలలను సహకారం చేసే దిశలో ముందుకు వెళ్లాలని సూచించారు.
కార్యక్రమంలో గ్రామస్తులు దుబాసి రాధాకృష్ణ,రాశమల్ల కిరణ్, గ్రామ పంచాయతీ సిబ్బంది రమేష్,శ్రీనివాస్,సబిత, అంగన్వాడీ టీచర్ లక్ష్మిబాయి పాల్గొన్నారు.