వేద న్యూస్, చొప్పదండి:
మండలంలోని వెదురుగట్ట గ్రామం రామలింగంపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ మహిళలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు. సమగ్ర శిశు అభివృద్ధి సేవల కార్యక్రమంలో భాగంగా గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మరియు చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగుపరచే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గర్భిణులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే మూడు సంవత్సరాల లోపు పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ లెవల్ మానిటరింగ్ సపోర్ట్ కమిటీని ఏర్పాటు చేసి చైర్మన్గా గ్రామ సర్పంచ్ పెంచాల శ్రీనివాస్, సభ్యులుగా మారం సమత, మారం ఐలయ్య, కొమ్ము సుజాతలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ నర్సింగ్ రాణి, ఎన్ఎమ్ లక్ష్మి, గ్రామ కార్యదర్శి శిరీష్, సూపర్వైజర్ నశ్రత్, ఆశా వర్కర్ మంజుల, అంగన్వాడీ టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.