•  సుల్తానాబాద్ రోడ్ షో‌లో ప్రజలకు మంత్రి కేటీఆర్ పిలుపు

వేద న్యూస్, సుల్తానాబాద్:
‘రైతు బంధు’ను ఆపిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని ప్రజలకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ముందస్తు పెట్టుబడి అందించేందుకు రైతుబంధు పథకం ప్రారంభించారన్నారు.

ఇప్పటికే 11 సార్లు రైతుబంధు ఇచ్చారని, కేంద్ర ఎన్నికల సంఘం సైతం రైతుబంధు నిరంతర ప్రక్రియ కాబట్టి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు వేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చారని గుర్తుచేశారు. ఓటమి భయంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో..బీజేపీ ఢిల్లీ లో కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘం నుండి తిరిగి ‘రైతుబంధు’ను వేయకుండా ఆదేశాలు ఇప్పించారని విమర్శించారు.

అటువంటి కాంగ్రెస్, బీజేపీ లకు ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని జనాన్ని అభ్యర్థించారు. కారు గుర్తుకు ఓటు వేసి దాసరి మనోహర్ రెడ్డిని గెలిపిస్తే డిసెంబర్ 3 తర్వాత..ప్రతీ మహిళకు మూడు వేల రూపాయలు అందుతాయన్నారు. 400 రూపాయలకే సీలిండర్ అందిస్తామని, తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికి సన్న బియ్యంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా అందిస్తామన్నారు.

సన్యాసులకు ఓటు వేస్తే అభివృద్ధి జరగదని,నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న మనోహర్ రెడ్డికి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. దాసరిని గెలిపిస్తే నియోజకవర్గంలో కొలనూరు, గర్రెపల్లి, పెద్దపల్లి రూరల్ మండలాలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. రోడ్ షోలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి , ఎంపీ వెంకటేష్ నేత తో పాటు పౌర సరఫరాల ఛైర్మెన్,జిల్లా ఛైర్మెన్ లు, ఎంపీపీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.