వేద న్యూస్, జమ్మికుంట:
‘నిజం గడప దాటేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది’ అన్నట్టుగా కొన్ని విషయాలు అసత్యాలు జనబాహుళ్యంలో ఉన్నాయి. అలా కిడ్నీ రోగాలపై సైతం లేనిపోని అపోహలు, అబద్ధాలు ప్రజల్లో ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కిడ్నీ డిసీజెస్పై ఉన్న అపోహలు, నిజాలను జమ్మికుంట సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వివరించారు.
అపోహ: అన్ని కిడ్నీ రోగాలు అతి ప్రమాదకరమైన వ్యాధులు.
నిజము: కాదు. అన్ని కిడ్నీ రోగాలు ప్రమాదకరం కావు. సరైన చికిత్స, ఉపచారములతో చాలా వరకు కిడ్నీ రోగాలు నయమవుతాయి.
అపోహ: కిడ్నీ ఫెయిల్యూర్ వ్యాధిలో ఒక కిడ్నీ మాత్రమే పాడవుతుంది.
నిజము: కాదు. రెండు కిడ్నీలు పాడవుతాయి. సామాన్యముగా ఎవరైనా రోగికి ఒక కిడ్నీ పూర్తిగా పాడయిపోయినా ఆ రోగికి ఎలాంటి కష్టము కలగదు. రక్తంలో క్రియాటిన్, యూరిగా పరిణామములలో ఏ విధమైన మార్పు కనబడదు. రెండు కిడ్నీలు ఎప్పుడయితే పాడవుతాయో అప్పుడు కిడ్నీ ద్వారా శుభ్రపడవలసిన శరీరములోని అనవసరమైన చెత్త పదార్థాలు శరీరము నుంచి బయటకు పోలేవు. దానివల్ల రక్తంలోని క్రియాటిన్ యూరియా పరిణామములు పెరుగుతాయి. రక్త పరీక్ష చేయడం ద్వారా క్రియాటిన్, యూరియా పరిణామములు వృద్ధి చెంది కిడ్నీ ఫెయిల్యూర్ నిదర్శణాన్ని తెలియజేస్తుంది.
అపోహ: కిడ్నీకి సంబంధించిన ఏ వ్యాధిలోనైనా శరీరం వాచిపోవడము కిడ్నీ ఫెయిల్యూర్ నిదర్శనము.
నిజము: కాదు. కిడ్నీకి సంబంధించిన అనేక రోగములలో కిడ్నీ పని చేయడము సామాన్య పద్ధతిలో ఉన్నా శరీరంలో వాపు వస్తుంది. ఉదాహరణకు నెఫ్రోటిక్ సిండ్రోమ్లో అలాగే అవుతుంది.