- తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు భాస్కర్
వేద న్యూస్, ఎల్కతుర్తి:
ఎల్కతుర్తి మండల పరిధిలోని రైతులు సాగు చేసిన పొగాకును కొనుగోలు చేసిన కాంట్రాక్టర్ మద్దతు ధర చెల్లించకుండా మోసగించారని తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్ తెలిపారు. సదరు కాంట్రాక్టర్ అన్నదాతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ..మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన సుమారు 40 మంది రైతులు 100 ఎకరాల్లో గత 20 సంవత్సరాలుగా పొగాకు పంటను సాగు చేస్తున్నారని చెప్పారు.
పండిన పంటను వీఎస్టి టీ లిమిటెడ్ కంపెనీకి మద్దతు ధరకు విక్రయించగా, ఈ ఏడాది అందుకు భిన్నంగా ప్రాంతానికో ధర చెల్లిస్తున్నారని వెల్లడించారు. చింతలపల్లికి చెందిన రైతులు సుమారు 800 క్వింటాళ్ల పొగాకును వీఎస్టి కంపెనీకి విక్రయించగా, కిలో పొగాకుకు రూ.60 నుంచి రూ.80 వరకు మాత్రమే ధర నిర్ణయించా రని తెలిపారు.
ఇదే నాణ్యతతో ఉన్న పొగాకుకు రఘునాథపల్లిలో కిలోకు రూ.100 నుంచి రూ.120 వరకు చెల్లించారని ఆరోపించారు. సదరు కంపెనీ కాంట్రాక్టర్ వెంటనే రైతులకు న్యాయం చేయాలని కోరారు.