వేద న్యూస్, వరంగల్ క్రైమ్:
భూ సమస్య విషయంలో బాధితులపై అక్రమ కేసులు నమోదు చేసి, భూకబ్జాదారులకు భూమిని స్వాధీనం పర్చేందుకు యత్నించిన జనగామ జిల్లా నర్మెట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగబాబు, నర్మెట్ట పోలీస్ స్టేషన్ ఎస్సై అనిల్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. భూతగాదా విషయంలో గత మూడేళ్లుగా బాధితుల స్వాధీనంలో ఉన్న భూమిని కేవలం ధరణి పోర్టల్లో ఉన్నదన్న సాకును చూపిస్తూ భూ కబ్జాదారులకు బాధితుల భూమిని ఇప్పించేందుకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై కబ్జాదారులకు సహాయసహకారాలు అందజేయడంతో పాటు బాధితులపై అక్రమంగా కేసులు నమోదు చేయడంతో బాధితులు పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్.. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలోని డీసీపీ, ఏసీపీ స్థాయి అధికారులతో క్షేత్ర స్థాయిలో విచారణ జరిపించారు. స్థానిక ప్రజల వాంగ్మూలం తీసుకున్నారు. ఈ విచారణలో బాధితులను ఇబ్బందులకు గురిచేయడంతో పాటు బాధిత వ్యతిరేకులకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సైలు భూకబ్జాదారులకు సహకరించినట్లుగా నిజ నిర్ధారణ కావడంతో ఈ ఇద్దరు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.