వేద న్యూస్, డెస్క్ :

మేడారంలో అంతర్జాతీయ స్థాయిలో అమ్మవార్ల పేరిట సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయన మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి గురువారం మేడారం చేరుకున్నారు. హెలిపాడ్ నుండి నేరుగా సమ్మక్క గుడికి చేరుకొని తల్లుల దర్శనం చేసుకున్నారు. అనంతరం నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించుకున్ని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా పాడి పంటలతో దేశం అంత సుభిక్షంగా ఉండాలని తల్లులను కోరుకున్నానని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందిరిపై ఉండాలన్నారు. మేడారం జాతరకు రూ.3 కోట్ల 14 లక్షలను కేంద్రం అందించిందన్నారు. రూ.900 కోట్లతో సమ్మక్క-సారలమ్మ కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు అయన తెలిపారు.

ఈ మేరకు తాత్కాలిక సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్ లో తాత్కాలిక భవనం ఏర్పాటు చేసి ఈ ఏడాది నుంచే ప్రవేశాలు కల్పిస్తామన్నారు. అందులో స్థానిక గిరిజన బిడ్డలకే అత్యధిక సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.

నూతన యూనివర్సిటీ అయినందున సలహాదారుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహరిస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో యూనివర్సిటీ నిర్మాణ పనులు చేపట్టి త్వరతగతిన పూర్తి చేస్తామన్నారు. ఎన్నికల అనంతరం శాశ్వత భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు అయన చెప్పారు. ఈ మేరకు భవన నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

ఈ నిర్మాణ పనుల కోసం ఇప్పటికే ఏజెన్సీలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 337 ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ సేకరించారని మరింత భూమి సేకరించాలిసి ఉందన్నారు. రేపు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మేడారం రానున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ (సీతక్క) మాట్లాడుతూ మేడారం సమ్మక్క – సారలమ్మ తల్లుల దీవెనలు భక్తులందరిపై ఉండాలన్నారు.

శుక్రవారం రాష్ట్ర గవర్నర్ 10 గంటలకు మేడారం రానున్నరన్నారు. గవర్నర్ మేడారం రావడం ఇది 3వ సారి అని పేర్కొన్నారు. అదే విధంగా రేపు 12 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి , జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు మేడారం రానున్నట్లు ఆమె తెలిపారు. అమ్మవార్ల ఘనతను, జాతర కీర్తిని దేశం మొత్తం వ్యాప్తి చేస్తున్న మీడియా పాత్రికేయులకు ఆమె ఈ సందర్బంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, దేవాదాయ శాఖ కమిషనర్ సునీల్ కుమార్, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.