నిబంధనల ప్రకారం ఎరువులు,విత్తనాలు విక్రయించాలి

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

వేద న్యూస్, ముస్తాబాద్ :

ముస్తాబాద్ మండలంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ఎరువులు, విత్తనాల స్టాక్, సేల్స్ రిజిస్టర్ లను పకడ్బందీగా నిర్వహించాలని విక్రయదారులను,అధికారులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. గురువారం ముస్తాబాద్ మండలంలోని శ్రీనివాస్ ఎరువులు & విత్తనాలు, కోరమండల్ మన గ్రోమోర్, విక్రయ దుకాణాలను , గోదాములను, ఆవునూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎరువులు..విత్తనాలు దుకాణాల్లో ఎరువులు, విత్తనాలను పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీనివాస్ ఎరువులు.. విత్తనాలు, కోరమండల్ మన గ్రోమోర్ విక్రయ దుకాణాలలో, ఆవునూరు లోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలోని సేల్స్ రిజిస్టర్ మరియు స్టాక్ రిజిస్టర్ పరిశీలించి గోదాం ను తనిఖీ చేయగా కోరమండల్ మన గ్రోమోర్ గోదాములో యూరియా స్టాక్ లేనట్లు గమనించి సదరు దుకాణంకు నోటీసులు జారీ చేయవలసిందిగా తెలిపారు. సదరు నోటీసులకు సరైన సంజాయిషీ సమర్పించి యూరియా స్టాక్ వెంటనే తెప్పించాలని ఆదేశించారు.
నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. నాణ్యమైన విత్తనాలు మాత్రమే రైతులకు అందజేయాలని , కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని విక్రయ యజమానులను కలెక్టర్ ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జలి బేగం,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.