వేద న్యూస్, వరంగల్ క్రైమ్:

హనుమకొండ జిల్లా కేయూ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండ్ల సింగారంలో గురువారం కాల్పుల కలకలం రేగింది. అత్త కమలను కానిస్టేబుల్ ప్రసాద్ తన సర్వీస్ రివాల్వర్తో కాల్చి చంపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా హనుమకొండ జిల్లా ఉలిక్కిపడింది.

పూర్తి వివరాలోకి వెళితే గుండ్ల సింగారానికి చెందిన రమాదేవికి, వరంగల్ జిల్లా కీర్తి నగర్ కు చెందిన అడ్డె ప్రసాద్ తో 25 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. కుటుంబ కలహాలతో గత మూడేళ్లుగా భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అయితే, పెద్దపల్లి జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నా ప్రసాద్ తుపాకీ తీసుకొని గుండ్ల సింగారంలోని తన అత్తగారి ఇంటికి వచ్చాడు.

ఈ నేపథ్యంలో అత్త కమలమ్మ (53)కు ప్రసాద్ కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్ తన వద్ద ఉన్న తుపాకీతో కమలమ్మను కాల్చి చంపాడు.ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు నిందితుడిని పట్టుకొని చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కమలమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.