వేద న్యూస్,వరంగల్ :
ఇంటర్మీడియట్, పదోతరగతి పరీక్షలు జిల్లాలో పగడ్బందీగా నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్, పదవ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్మీడియట్ పరీక్షకు 26 సెంటర్స్ లలో 12,620 మంది పరీక్షలకు హాజరవుతారని అన్నారు. అలాగే పదో తరగతి పరీక్షలకు 54 సెంటర్లలో 9455 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాస్తారని చెప్పారు.
విద్యార్థులు దూర ప్రాంతాల నుండి ఆర్టీసి బస్సులలో పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా బస్సులను అందుబాటులో ఉంచాలని, పరీక్షా హాలులో విద్యార్థిని, విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులను లోపలికి అనుమతించరాదని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద వైద్య సిబ్బందిని మందులతో అందుబాటులో ఉంచాలని, పరీక్షా కేంద్రాలలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలని, త్రాగునీటి వసతి, పరిశుభ్రత నిర్వహణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సూచించారు.
ప్రశ్నాపత్రాలను పోలీసు బందొబస్తు ద్వారా పరీక్షా కేంద్రాలకు, పరీక్ష ముగిసిన తర్వాత పోస్టల్ శాఖకు జవాబు పత్రాలను సీల్ చేసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో తరలించాలని సూచించారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్లు న విధులు నిర్వహించాలని, జిల్లాలోని ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఉండేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు