• నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
  •  డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు నరేష్ పటేల్

వేద న్యూస్, జమ్మికుంట:

యువత సంక్షేమానికి పాటుపడతామని చెబుతూనే, యువజన సర్వీసులు, క్రీడలకు బడ్జెట్లో నిరాశ జనకంగా కేటాయింపులు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగాల నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి అమలు చేయాలని. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా అధ్యక్షులు డి.నరేష్ పటేల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం జమ్మికుంట మండలకేంద్రంలో డీవైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కు ముఖ్యఅతిథిగా హాజరైన నరేష్ పటేల్ మాట్లాడుతూ యువత సంక్షేమానికి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రవేశపెట్టిన మొట్టమొదటి బడ్జెట్ లోనే యువజనుల సర్వీసు శాఖకు సరైన బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం అన్యాయం అని పేర్కొన్నారు.

2021-22 బడ్జెట్ లో 188 కోట్లు,2022-23 బడ్జెట్లో 176 కోట్లు,2024-25 బడ్జెట్లో 173 కోట్ల 93లక్షలు మాత్రమే కేటాయింపులు ఉన్నవని వివరించారు. ఈ కొద్దిపాటి నిధులతో రాష్ట్రంలో యువజన సర్వీసులు, క్రీడల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని అడిగారు. యువజన సంక్షేమాన్ని గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని చెప్పి… ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరిగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఎన్నికల ముందు పేర్కొన్న మాదిరిగా నిరుద్యోగ భృతి చెల్లింపు విషయంలో స్పష్టత ఇవ్వలేదని అన్నారు.

అర్హులైన నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జాబ్ క్యాలెండర్ ప్రకటన, 2 లక్షల ఉద్యోగాలపై నామమాత్ర ప్రస్తావననే తప్ప స్పష్టత లేదని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలపై అసెంబ్లీ సమావేశాల ముందు ప్రకటించిన మాదిరిగా సత్వరమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి, గడువులోపు రెండు లక్షల ఉద్యోగాలుభర్తీ చేయాలని కోరారు.

యువజనులు క్రీడలు శారీరక నైపుణ్యం కేంద్రాలు పెంచాలన్నారు. యువత నైపుణ్య శిక్షణ అభివృద్ధి కోసం ప్రత్యేక యూనివర్సిటీ నిర్మిస్తామని చెప్పిన మాటలకు బడ్జెట్లో మాత్రం ప్రస్తావించలేదని వెల్లడించారు.

విద్యారంగానికి ఆశించిన మేరకు బడ్జెట్ కేటాయింపులు లేవని, పాఠశాల, ఉన్నత విద్య యూనివర్సిటీలు మరింత సంక్షోభంలో ఉన్నాయని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. డీవైఎఫ్ఐ జమ్మికుంట మండల కన్వినింగ్ కమిటీ ఎన్నిక కన్వీనర్ గా ఎలుక సాయి, కో కన్వీనర్ గా ముద్దమల్ల చరణ్ కమిటీ ఎన్నుకున్నట్టు వారు తెలిపారు. విద్యార్థి యువజన సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని భవిష్యత్తులో పూర్తిస్థాయి మండల కమిటీ వేసుకుంటామని వారు స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు ముద్దమల్ల చరణ్, ఎలుక సాయీ, పర్లపెల్లి జీవన్, సిద్దు,స్వాగత్ బాలు, సురేష్, శ్రీకాంత్ తదిరులు పాల్గొన్నారు.