- ఆయన్ను సస్పెండ్ చేయండి: డీజీపీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్కు బాబు రామ్ నాయక్ ఫిర్యాదు
- ‘మీ అంతు చూస్తా’ నంటూ ఎస్ఐ బెదిరింపులు : బాధితుడు రెడ్యా నాయక్ ఆరోపణ
వేద న్యూస్, ఫోకస్ టీమ్:
గిరిజనులపై నేరేడుగొమ్ము ఎస్ఐ దౌర్జన్యం చేస్తున్నారని, ఆయన్ను సస్పెండ్ చేయాలని తెలంగాణ గిరిజన సాంస్కృతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాబు రామ్ నాయక్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం రాష్ట్ర డీజీపీ, ఎస్సీ, ఎస్టీ కమిషన్కు కంప్లయింట్ చేశారు. ఈ నెల(మే) 2న, మూల వాగు తండాలో గొడవ జరగగా, ఆ విషయమై కేసు పెట్టడానికి నేరడుగొమ్ము పోలీస్ స్టేషన్కు వెళితే..ఎస్ఐ ఫిర్యాదు తీసుకోకుండా బాధితులను దూషించారని, కాలుతో తన్నాడని ఆరోపించారు.
మళ్లీ మూల వాగు తండాలో ఈ నెల 24న (మే) శనివారం గొడవ జరిగిందని, బాధితులు 100 డయల్ చేసి కంప్లయింట్ చేశారని వెల్లడించారు. ఎస్ఐ సతీష్ ఈ నెల 26న (సోమవారం) ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్న మూడవత్ బాబు, రెడ్యా నాయక్లపై ఆసుపత్రిలోనే అందరూ చూస్తుండగానే.. ఇష్టానుసారంగా దూషించి.. బెదిరించారని వెల్లడించారు.
పోలీస్ అధికారి ఇలా వ్యవహరించడం సరికాదని బాబురామ్ నాయక్ తెలిపారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని న్యాయం కోసం వేడుకుంటున్న గిరిజన కుటుంబాన్ని..‘మీ అంతు చూస్తా’ నంటూ ఎస్ఐ బెదిరించారని బాధితులు బాబు నాయక్ రెడ్యా నాయక్ ఆరోపించారు.
ఆస్పత్రికి వచ్చిన ఎస్ఐని గిరిజన మహిళలు ఓ వైపు వేడుకుంటున్నా.. ‘ఎవరూ నన్ను ఏమి చేయలేరు’ అంటూ మహిళల పట్ల కూడా దురుసుగా ప్రవర్తించి వెళ్లారని పేర్కొన్నారు. సదరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కేతావత్ బాబురామ్ నాయక్ డిమాండ్ చేశారు.