•  జనావాసాలకు సమీపంలో ఉన్నా పట్టించుకోరా?
  •  ఓ వ్యక్తికి మెడపైన గాయం, చిన్నారికి కనుబొమ్మలపైన తీవ్రగాయం
  •  పేలుళ్లు జరిపిన వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి

వేద న్యూస్, వరంగల్:

జనావాసాలకు సమీపంలో ఉన్న గుట్టల్లో(ఎడ్లబండ) రాళ్లను బాంబులతో పేల్చడంతో ప్రజలు బెంబేలెత్తారు. బాంబు పేలుళ్ల ధాటికి (సౌండ్‌కు).. తమ ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయని భయాందోళన వ్యక్తం చేశారు.

వివరాల్లోకెళితే.. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలో.. (ఎడ్లబండ) గుట్టల వద్ద బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా బాంబులు పేలాయి. దాంతో గ్రామ జనం అతలాకుతలమయ్యారు. ఆ గుట్టకు సమీపంలో సుమారు 20కి పైగా కుటుంబాలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ మొత్తం భయపడిపోయాయి.

బాంబుల ధాటికి సమీపంలోని కోళ్లఫారం రేకుల పైకప్పు విరిగిపోయింది. ఓ వ్యక్తి మెడపైన తీవ్రమైన గాయం కాగా, ఓ చిన్నారికి కన్నుమీద గాయమై పెనుప్రమాదం తప్పింది. కోళ్లఫారంలోని గుడ్లన్నీ పగిలిపోయాయి. కాగా, ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకుండా.. బాంబు పేలుళ్లు నిర్వహిస్తే.. ప్రమాదవశాత్తు ఎవరికైనా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు? అని ప్రత్యక్ష సాక్షులు ప్రశ్నించారు.

ప్రజల(సామాన్యులు) ప్రాణాలంటే పట్టింపు లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ వారు సదరు క్రషర్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంత మంది వ్యక్తులు గుట్టల(ఎడ్లబండ) వద్ద బాంబులు పెట్టి రాళ్లను విడగొడుతున్నట్టు తెలుస్తోంది. ఆ రాళ్లను వేరే చోటుకు క్రషర్ వద్దకు తీసుకెళ్లి మళ్లీ క్రషింగ్ చేస్తున్నట్టు సమాచారం.

 

 

 

నాకు ప్రమాదం తృటిలో తప్పింది: సంగెకారి యువరాజు, దేవునూరు గ్రామస్తుడు

గుట్టల వద్ద బాంబు పేలుడు నుంచి నాకు ప్రమాదం తృటిలో తప్పింది. నిజానికి నేను ఆ సమయానికి బాంబు పేలుడు జరిగిన ప్రాంతానికి వెళ్లాల్సి ఉండగా, వేరే పని నిమిత్తం వెళ్లలేదు. అలా నాకు ప్రమాదం తప్పింది. జనావాసాలకు సమీపంలో ఇలా బాంబు పేలుళ్లు జరపడం సరికాదు.

 

విచ్చలవిడిగా మందు సామగ్రి వాడుతున్నారు: కె.సందీప్, దేవునూరు గ్రామస్తుడు
రైతులు పంటపొలాలకు కోడి ఎరువు తరలించే సమయంలో బాంబు పేలుళ్లు జరుపుతున్నారు. ఎడ్లబండ వద్ద కొందరు వ్యక్తులు విచ్చలవిడిగా మందు సామగ్రి వాడుతూ బాంబు బ్లాస్టింగ్ చేస్తున్నారు. బుధవారం ఎడ్లబండ వద్ద మందుసామగ్రి వాడి బాంబు పేలుళ్లు కొందరు జరిపారు. పక్కనే కోళ్లఫారం ఉన్నా పట్టించుకోకుండా బాంబు పేలుళ్లు జరిపారు. దాంతో కోళ్లఫారం రేకులు పగిలిపోవడంతో పాటు కొందరికి గాయాలయ్యాయి. ఓ వ్యక్తికి మెడపైన, మరో చిన్నారికి కనుబొమ్మలపైన తీవ్రమైన గాయమయింది. కొద్దిలో పెనుప్రమాదం తప్పింది. బాధితులకు న్యాయం చేయాలి. అధికారులు సదరు వ్యక్తుల(క్రషర్ కు సంబంధించిన యాజమాన్యం)పై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *