• జన విజ్ఞాన వేదిక (జేవివి), ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ ( ఏఐపియస్ఎన్) నాయకులు ప్రొ.ముంద్రా ఆదినారాయణ (73) కు జోహార్లు

ప్రశ్న ఎంత చిన్నదైనా, జటిలమైనా, అది రసాయన చర్య వేగమా, క్వాంటం సిద్ధాంతమా లేక మూఢ నమ్మకాల గుట్టు విప్పే ప్రకృతి రహస్యమైనా.. ఆయన సమాధానం ‘వెరీ సింపుల్‌’ అనే మాట ఆయన నోటి నుండి వచ్చేది. ఆ మాటే వినే వారిలో కొండంత విశ్వాసాన్ని నింపేది. జవాబు ఎంత సింపుల్‌గా ఇస్తారో అంతకంటే సింపుల్‌గా ఉండే మనిషి.. వారే ప్రొఫెసర్‌ ఆదినారాయణ.

మూడు దశాబ్దాలకు పైగా క్లిష్టతరం అనుకునే రసాయన శాస్త్రాన్ని యూనివర్సిటీలో బోధించిన ప్రొఫెసర్‌ అంటే నమ్మలేం. తానొక ప్రొఫెసర్‌నన్న స్పృహగాని, అత్యంత ప్రతిష్టాత్మక పరిశోధనా సంస్థ జర్మనీలో ఏండ్ల పాటు పరిశోధనలు చేశానన్న గర్వంగాని, డిఎన్‌ఏ రిపేరు వంటి ఆధునిక విషయాలను శోధిస్తున్నానన్న దర్పంగాని ఏ కోశానా కనిపించేవి కావు. నిన్న మొన్ననే నల్లగొండ జిల్లా నల్లబండగూడెం నుండి వచ్చిన రైతు బిడ్డలా నలుగురితో కలిసిపోతారు. దశాబ్దాలుగా తెలుగులో రసాయనశాస్త్ర పాఠ్య గ్రంథాల రచయిత, సంపాదకులుగాను, ప్రయోగాలు చేస్తూ పిల్లలకు సైన్సును బోధించాలనే ఆలోచనల కనుగుణంగా కొత్త పుస్తకాలు తేవటంలో ప్రొ.ఆది నారాయణ చేసిన కృషికి నేడు రెండు తెలుగు రాష్ట్రాల సైన్సు పుస్తకాలే సాక్ష్యం.

ఎన్ని కొత్త పద్ధతులు, పుస్తకాలు ప్రవేశ పెట్టినా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేకపోతే ఫలితం శూన్యమని నమ్మిన వారు ఆది నారాయణ సార్‌. అందుకోసం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరగతి గది బోధనకు తోడ్పడే ప్రయోగ దీపికలను తెచ్చిన వారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయులను సమాయత్తం చేయడానికి వారం రోజుల శిక్షణా కార్యక్రమాలు దాదాపు వంద వరకు నిర్వహించడంలో కీలకపాత్ర ఆయనది.

రంప చోడవరం నుండి ఇచ్చోడ వరకు ఆదివాసీ ఆశ్రమ పాఠశాల పిల్లలకు బాలోత్సవాలు నిర్వహించి, వారిలో వైజ్ఞానిక స్పృహను నింపిన నిజమైన ప్రజా సైన్సు ఉద్యమకారుడు. పిల్లలు ఎక్కడున్నా, ఎక్కడకు రమ్మన్నా ఆనందంగా అడుగులు వేసిన పసిమనస్కులు ఆయన. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా నిబ్బరంగా ఎదుర్కొని ముందుకు నడిచిన ధీశాలి.

నమ్మిన దానికోసం, నిక్కచ్చిగా, నిజాయితీగా, నిబద్దతతో ముందుకు సాగటం ఆయన నైజం. సైన్సు ఉద్యమంలో తనతో నడిచిన మిత్రులపై, శిష్యులపై చెరగని ముద్ర వేసిన ఆయనే మన ప్రొ. ఆది నారాయణ. ఉపాధ్యాయ శిక్షణా తరగతులకు హాజరైన విశాఖ, విజయనగరం, మిత్రులు వెలిబుచ్చిన అభిప్రాయాన్నొకదాన్ని ఇక్కడ గుర్తు చేయకుండా ఉండలేము.

‘ఎప్పుడో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను ఆయన శిష్యులు గుర్రం బగ్గీలో స్వయంగా లాగుతూ స్టేషన్‌కు తీసుకు పోయారని విన్నాం. ఈ రోజు అంతటి గురువును కళ్లారా చూశాం’ అని చెప్పటం మా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. బోర్డుమీద రాసేందుకు కుడి చేయి లేవకుంటే రెండో చేత్తో పట్టి లేపి పాఠం చెప్పిన గొప్ప గురువు. చెకుముకి అంటే ఆయనకు ప్రాణం. ఆయన ప్రయోగాలతో ‘క్విజ్‌’కు వన్నె తెచ్చారు. అదే చెకుముకి సంబురాలు, భువనగిరి వేదిక, రోజంతా పిల్లలతో చిరునవ్వులు చిందించిన ప్రొ. ఆదినారాయణ, ఇక సెలవంటూ నిష్క్రమించారు. తాను ప్రేమించిన పనిలో పాల్గొంటూ తనువు చాలించిన ప్రొ.ఆది నారాయణ ధన్యజీవి.

– మూలం: ప్రొ. కట్టా సత్యప్రసాద్

  • వి. కృష్ణ మోహన్
    నేషనల్ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ)
    కార్యదర్శి, ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసీయేషన్‌ (టాప్రా) నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్ (ఎన్.సి.సి.పి.ఏ) అనుబంధం 9182189533, 9440668281 ,హైదరాబాద్ kmdrdo@gmail.com