వేద న్యూస్, జమ్మికుంట:

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు నిత్యం చెబుతుంటారు. అయితే, కొందరు హెల్త్‌ పట్ల నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఏదైనా అనారోగ్యం బారిన పడినా.. ఏవైనా లక్షణాలు కనిపించినా పట్టించుకోరు. అది చాలా ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కిడ్నీ వ్యాధుల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని జమ్మికుంట సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వైద్యుడు, ఎండీ జనరల్ మెడిసిన్, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఎమర్జెన్సీ, క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, పెయిన్ స్పెషలిస్ట్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ ఊడుగుల సురేశ్ వెల్లడించారు. కిడ్నీ వ్యాధుల లక్షణాలపై ఆయన ‘వేద న్యూస్’తో మాట్లాడారు. అవేంటో మీరూ తెలుసుకోండి..

రకరకాల కిడ్నీ వ్యాధులకు లక్షణాలు వేరు వేరుగా ఉంటాయి. వాటిలో ముఖ్య లక్షణాలు ఈ విధంగా ఉంటాయి.
– ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖం, కళ్లు వాచి ఉండటం.
– ఆకలి తక్కువగా ఉండటం, వాంతులు చేసుకోవడం, వికారంగా అనిపించడం.
– తరచూ మూత్ర విసర్జన అవసరమవడం.. (ప్రత్యేకంగా రాత్రివేళల్లో)
– చిన్న వయస్సులోనే రక్తపోటు వ్యాధి ఉండటం. నీరసంగా, రక్తం నిస్సారంగా అవడం.
– కొంచెం నడిచే సరికి ఆయాసము రావడం, నీరసంగా అనిపించడం.
– 6 ఏండ్ల వయస్సు తర్వాత కూడా మంచం మీదనే మూత్రం పోయడం, మూత్రం తక్కువగా రావడం
– మూత్ర విసర్జన సమయంలో మంట పుట్టడము, మూత్రంలో రక్తం కానీ చీము కానీ రావడం
– మూత్ర విసర్జన కష్టమై.. బొట్టు బొట్టుగా రావడం..
– కడుపులో పుండు అవడం, కాళ్లలో, నడుము నొప్పి కలగడం.

పైన వివరించిన లక్షణాలలో ఏ ఒక్క లక్షణము ఉన్నా కూడా కిడ్నీ రోగము ఉండటానికి అవకాశం ఉంటుంది. పైన పేర్కొన్న వాటిల్లో ఏది ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *