• మరోసారి కరీంనగర్ జిల్లాకే కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి!?
  • దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు సెగ్మెంట్‌ ఎంపీగా గెలిచిన రాజేందర్
  •  సిట్టింగ్ ఎంపీ..సీఎం రేవంత్‌రెడ్డి లోక్‌సభ స్థానంలో సత్తా చాటిన నేత 
  •  ఈటలను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే స్వాగతిస్తానన్న ప్రస్తుత ప్రెసిడెంట్ కిషన్‌రెడ్డి
  • కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాతో రాజేందర్‌కు ప్రత్యేక అనుబంధం
  • పడి లేచిన కెరటం.. ‘అసెంబ్లీ’లో ఓడినా..పార్లమెంటు ఎలక్షన్స్‌లో గెలుపు
  •  హైదరాబాద్ నుంచి ఢిల్లీకి..రాష్ట్రం నుంచి దేశ రాజకీయాల్లోకి ఎంపీగా ఈటల
  • దాదాపు 4 లక్షల మెజార్టీతో ఎంపీగా సీనియర్ పొలిటీషియన్ విక్టరీ

వేద న్యూస్, జమ్మికుంట:

బీజేపీ స్టేట్ చీఫ్ గా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ను నియమించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపుగా ఆయన పేరునే లాంఛనంగా ఖరారు చేసే చాన్సెస్ మెండుగా ఉన్నాయని పార్టీ వర్గాల సమాచారం. మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్ కు రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించడం ద్వారా స్టేట్ లో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అనే విధంగా సంకేతాలు వెళ్తాయని కమలం పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్టు వినికిడి. ఈటలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమిస్తే స్వాగతిస్తానని ఇటీవల కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, ప్రస్తుత స్టేట్ చీఫ్ గంగాపురం కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 

 

కేసీఆర్ భూమి, ఆకాశాన్ని ఏకం చేసినా!..‘బై పోల్’లో ఈటలదే పై చేయి

ఉద్యమకారుడిగా ఆయన ప్రస్థానం ప్రత్యేకం. సీజన్ డ్ పొలిటీషియన్ గా రాష్ట్ర రాజకీయాల్లో తన దైన ముద్ర వేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు రాజకీయ ఓనమాలు తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈటల రాజేందర్ సుపరిచితులు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ను ఓడించడానికి ఆనాటి సీఎం కేసీఆర్ భూమి, ఆకాశాన్ని ఏకం చేసి..! ఎన్నికల బరిలోకి దిగినా.. బరి గీసి కొట్లాడి విజేతగా నిలిచాడు. దాదాపు పాతిక వేల మెజారిటీతో గెలిచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గి పై చేయి సాధించారు. అయితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. గజ్వేల్, హుజూరాబాద్ సెగ్మెంట్లు..రెండు స్థానాలలో కంటెస్ట్ చేసి ఓడిపోయారు. కాగా, 2024 లోక్ సభ ఎలక్షన్స్ లో మాత్రం తిరుగు లేని మెజార్టీతో విజయం సాధించారు.

ఉద్యమకారుడిగా ఈటల ముద్ర ప్రత్యేకం 

హుజురాబాద్ గడ్డ ఈటల అడ్డ అన్న మాదిరిగా సుమారు 20 ఏండ్ల కు పై చిలుకు ప్రజానీకానికి సేవలు అందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ.. పార్లమెంటు బరిలో నిలిచి విజయం సాధించారు. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి దాదాపు నాలుగు లక్షల మెజారిటీతో విజయం సాధించారు. పడి లేచిన కెరటం లా.. విజయపతాక ఎగురవేశారు. 

మరోసారి కరీంనగర్ గడ్డ నేతకు రాష్ట్ర కమల దళపతిగా చాన్స్?

ప్రజా సమస్యల పరిష్కారానికి తాను కొట్లాడుతానని,.. ప్రజల ఆదర అభిమానాలను చూర గొంటానని, మల్కాజి‌గిరి జనం గొంతుకగా పార్లమెంటులో నినదిస్తానని ఈటల వెల్లడించారు. కరీంనగర్ జిల్లా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రస్తుత కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు బాధ్యతలు నిర్వర్తించారు. ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి వరిస్తే..మరోసారి కరీంనగర్ జిల్లాకు అవకాశం లభించినట్టవుతుంది. 

ప్రజా సమస్యలు, పార్టీ లీడర్లు, కేడర్ పై అవగాహన ఉన్న లీడర్..

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా దాదాపు 20 ఏండ్లు వ్యవహరించిన ఈటల రాజేందర్..బీఆర్ఎస్ పార్టీలో నంబర్.2గా వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ ఉన్న సమయంలో ఆ పార్టీ అధితనే కేసీఆర్..తన కుటుంబ సభ్యులను కూడా కాదని ఈటల రాజేందర్ కు టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ గా అవకాశమిచ్చారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కీలక శాఖలు ఆర్థిక, వైద్యారోగ్యం ఇచ్చారు. అయితే, ప్రత్యేక తెలంగాణరాష్ట్ర సాధనకు సాగిన ఉద్యమంలో ఈటల రాజేందర్ తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించారు. కాలక్రమంలో ఆ పార్టీలో వచ్చిన రాజకీయ పరిణామాలు, అధినేత తీరు పట్ల ఈటల ధిక్కారాన్ని ప్రకటించారు. ‘గులాబీ జెండాకు ఓనర్లం మేమే’ అని ఒక నాడు ప్రకటించిన ఈటలను తర్వాత క్రమంలో పార్టీ నుంచి పంపించేశారు.

దాంతో ఈటల రాజేందర్ బీజేపీలో చేరి కేసీఆర్ కు వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన..పార్లమెంటు ఎన్నికలకు వచ్చే సరికి విజయం సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో లోక్ సభ సభ్యుడిగా పార్లమెంటులో మల్కాజిగిరి ప్రజల గొంతుకగా వ్యవహరిస్తానని ఈటల రాజేందర్ వెల్లడించారు.

మల్కాజిగిరి ప్రజలు వారి ఆత్మను ఆవిష్కరించి తనను గెలిపించారని, ఈటల వారికి కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్రమంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ సేవలను..లోక్ సభ సభ్యుడిగా, పార్టీకి అవసరమైన చోట కూడా బీజేపీ అధిష్ఠానం వినియోగించుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్న ఈటల రాజేందర్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నాయని సమాచారం.