- సీతంపేట జీపీలో అంతులేని అవినీతి!
- స.హ. చట్టంతో బయటపడిన అవినీతి బాగోతం: మాజీ ఎంపీటీసీ ఓదెలు
వేద న్యూస్, ఇల్లందకుంట:
గ్రామ అభివృద్ధి కోసం పనిచేశాడని భావించిన గ్రామ ప్రజలకు ఆ సర్పంచి ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడో ఒక్కొక్క అవినీతి బాగోతం బయటకు వస్తుండడంతో గ్రామ ప్రజలు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.! ఇల్లందకుంట మండలం సీతంపేట గ్రామంలో మాజీ సర్పంచ్ మూడెత్తుల వెంకటస్వామి ఐదేళ్ల పదవి కాలంలో జరిగిన అభివృద్ధి, ఆదాయ వ్యయాల వివరాలు కోరుతూ మాజీ ఎంపీటీసీ సభ్యుడు తెడ్ల ఓదెలు సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుతో గ్రామంలో జరిగిన అవినీతి బాగోతం బయటపడింది.! గ్రామంలో అభివృద్ధి పనుల పేరుతో జరిగిన అవినీతి వివరాలను బుధవారం మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఓదెలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
పల్లె ప్రకృతి వనం వెనుక నుంచి కొచ్చేరువు వరకు ఒకసారి పని జరిగితే.. రెండు సార్లు పని జరిగినట్లు బిల్లులు తీసుకున్నాడని తెలిపారు. పల్లె ప్రకృతి వనంలో ఒకసారి మొరం పోసి రెండుసార్లు మొరం పోసినట్లు బిల్లులు తీసుకోవడం జరిగిందన్నారు. పల్లె ప్రకృతి వనం ముందు నుంచి వెళ్లే దారిలో కెనాలి పైన కల్వర్టు నిర్మాణం చేయకుండా.. నిర్మాణం చేసినట్లు బిల్లు తీసుకున్నాడని అన్నారు.
గ్రామానికి చెందిన ఎం.జగదీష్ కు ఎలాంటి ట్రాక్టర్, బ్లేడు బండి, జెసిపి లేనప్పటికీ అతని పేరుతో జంగిల్ కటింగ్ కింద సుమారు మూడు లక్షల వరకు డ్రా చేసుకున్నాడని వివరించారు. హనుమాన్ టెంపుల్ నుండి బోయిని మల్లయ్య ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం చేపట్టకున్నప్పటికీ సుమారు 5 లక్షల వరకు బిల్లులు తీసుకున్నాడని రికార్డులో తెలిసిందన్నారు.
గ్రామంలో చేపట్టిన సిసి రోడ్ల నిర్మాణాలకు గ్రామ వార్డు సభ్యుల తీర్మానం లేకుండానే, మినిట్స్ బుక్కులో నమోదు చేయకుండానే.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మూడెత్తుల పద్మ పేరు పై పనులు చేయించి బిల్లులు తీసుకున్నాడని చెప్పారు. ఆ సర్పంచి ఐదేళ్ల పదవి కాలంలో గ్రామపంచాయతీ పరిధిలోని పలు వార్డులలో కంటి తుడుపు చర్యలుగా అక్కడక్కడ మొరం పోయించి.. సుమారు రూ.15 లక్షల వరకు నిధులు స్వాహా చేశాడని వెల్లడించారు.
గ్రామపంచాయతీ సాధారణ ఖర్చులకు సైతం లక్ష రూపాయల వరకు పంచాయతీ నిధుల నుండే ఖర్చు చేశాడని, తాము సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న సమాచారంతో వెల్లడైందని తెలిపారు.
ఒక గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడుగా ఉంటూ.. గ్రామానికి వచ్చిన నిధులు అన్నిటిని దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడిన సదరు మాజీ సర్పంచ్ పై పూర్తిస్థాయిలో విచారణ చేసి.. దుర్వినియోగానికి పాల్పడిన నిధులను రికవరీ చేయాలని..ఇటీవల జిల్లా కలెక్టర్ కు సైతం ఫిర్యాదు చేశామని స్పష్టం చేశారు.
తమ గ్రామంలో జరిగిన అవినీతిపై పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు, జిల్లాస్థాయి అధికారులు స్పందించి ..గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రత్యేక అధికారిచే విచారణ చేపట్టి అవినీతికి పాల్పడిన మాజీ సర్పంచితో పాటు అతనికి సహకరించిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.