– జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
వేద న్యూస్,నల్లగొండ ప్రత్యేక ప్రతినిధి :
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన దివ్యంగ క్రీడల పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలో దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పోటీలలో దివ్యాంగులు క్రీడా స్ఫూర్తితో ఆడారని కలెక్టర్ అన్నారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక సామర్ధ్యాలు పెంపొందించుకోవడంతో పాటు, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. సమాజంలోని అందరితోపాటు, దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని , ఇందుకుగాను విద్య, వైద్యం, ఉపాధి, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాలలో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించడానికి రెవిన్యూ డివిజన్లు,మండలాలలో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ప్రత్యేక ప్రజావాణిలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమం కోసం బ్యాటరీ మోటార్ వెహికల్స్, పింఛన్లను ప్రభుత్వం ఇస్తున్నదని, దివ్యాంగుల ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపిస్తామన్నారు. దివ్యాంగులు బాగా చదువుకోవాలని,అన్ని రంగాలలో అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ పి.రమేష్,జిల్లా సంక్షేమ సంక్షేమ అధికారి కృష్ణవేణి,డిఆర్ డిఓ శేఖర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిఇఓ బిక్షపతి ,జిల్లా క్రీడలు,యువజన సేవల అధికారి అక్బర్ అలీ,సిడిపిఓ హరిత తదితరులు ఉన్నారు.