- యువతకు ఆదర్శంగా నిలిచిన యువకుడు
- మారుమూల పల్లె నుంచి గ్రూప్1 ఆఫీసర్గా ఎదిగిన యువకెరటం
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
పట్టుదల, అకుంఠిత దీక్ష, ఆత్మవిశ్వాసం ఉంటే చాలు.. అనుకున్న లక్ష్యాన్ని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సాధించొచ్చని నిరూపించారు ఓ యువకుడు. మారుమూల పల్లెలోని నిరుపేద కుటుంబం నుంచి వచ్చి పోటీ ప్రపంచంలో తన కాళ్లపై తాను నిలబడి గ్రూప్-1లో 572వ ర్యాంకు సాధించి.. స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. ఆయన రేగొండ మండలం జగ్గయ్యపేటలో పంచాయతీ కార్యదర్శిగా 2019 వరకు విధులు నిర్వర్తించారు.
సురేశ్కు అండగా నిలిచిన కుటుంబం, దోస్తులు
భూపాలపల్లి మండలంలోని చికెన్పల్లి గ్రామానికి చెందిన వాంకుడోత్ సురేశ్ గ్రూప్-1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఎంపీడీవో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మండలంలోని చికెన్పల్లి గ్రామానికి చెందిన వాంకుడోత్ కమల, రామస్వామి దంపతులకు 10-07-1993లో వాంకుడోతు సురేశ్ జన్మించారు. సురేశ్ ఎనిమిదో ఏటనే తండ్రి రామ స్వామి అనారోగ్యానికి గురై మృతి చెందాడు. దీంతో తల్లి కమల.. సురేశ్ అతని సోదరుడిని అన్నీ తానై పెంచి పోషించి చదివించింది.
సురేశ్ గొల్లబుద్దారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశాడు. అనంతరం హనుమకొండలోని సహారా జూనియర్ కళాశాలలో ఇంటర్, ఎస్సార్ విద్యాసంస్థల్లో బీటెక్ పూర్తి చేశారు. ఈ క్రమంలోనే 2020లో తల్లి కమల మృతి చెందింది. సురేశ్ తన తోటి మిత్రుల సాయంతో హైదరాబాద్లో యూపీఎస్సీ కోచింగ్ తీసుకుని గ్రూప్-1 పరీక్ష రాసి సెప్టెంబర్ 25న విడుదలైన ఫలితాల్లో 572వ ర్యాంకు సాధించి ఎంపీడీవో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు.
గ్రూప్-1 విజయం తల్లికి అంకితం చేసిన సురేశ్
తల్లి ఇచ్చిన స్ఫూర్తితో ముందుకెళ్లారు సురేశ్. మొక్కవోని దీక్షతో పరీక్షలకు సన్నద్ధమయ్యారు. తన చిన్నతనంలో తన మాతృమూర్తి తన కొడుకు కలెక్టర్ అవ్వాలని కోరుకుందని, ఈ క్రమంలోనే తాజాగా గ్రూప్-1 కొలువు సురేశ్ సాధించి..ఉన్న ఊరు, కన్నతల్లి పేరు నిలబెట్టారు.
మట్టిలో మాణిక్యం మాత్రమే కాకుండా యువతకు స్ఫూర్తి ప్రదాతగా సురేశ్ నిలిచారు. గ్రూప్-1 సాధించిన సందర్భంగా ఈ విజయాన్ని తన తల్లికి అంకితం చేస్తున్నట్టు సురేశ్ పేర్కొనడం విశేషం. తన మాతృమూర్తి కష్టఫలితంగా, దీవెనగా ఈ ఉద్యోగం లభించినట్టు భావిస్తున్నానని వెల్లడించారు. తన విజయానికి తన సోదరుడు వి నరేశ్ సైతం మద్దతుగా నిలబడ్డారని పేర్కొన్నారు.
తండ్రి మాదిరిగా అరవింద్ మద్దతు
తన విజయంలో మరో కీలక భూమిక పోషించిన వ్యక్తి తన స్నేహితుడు ఎన్ అరవింద్ అని సురేశ్ వెల్లడించారు. సాధారణ దోస్తుగా పరిచయమైన అరవింద్ తనను తండ్రి మాదిరిగా ప్రోత్సహించాడని, ఆర్థికంగా, హార్ధికంగా, మోరల్గా మస్తు మద్దతు ఇచ్చారని స్పష్టం చేశారు. అరవింద్తో పాటు తన బీటెక్ కాలేజీ వరదారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ మిత్రులు కూడా కష్టకాలంలో తనకు అండగా నిలిచారని సురేశ్ చెప్పారు.
లక్ష్యసాధనలో నిమగ్నమై..
పువ్వు పుట్టగానే పరమళిస్తుందనే రీతిలో.. తొలి నుంచి చదువులో సురేశ్ రాణించారు. తను పుట్టి పెరిగిన ఊరుతో పాటు కుటుంబం గర్వించేలా జీవితంలో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అందుకు అనుక్షణం శ్రమిస్తూ.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగి విజేతయ్యాడు. గొల్లబుద్దారంలోని జెడ్పీ సెకండరీ స్కూల్లో స్కూలింగ్ పూర్తి చేశాడు సురేశ్.
ఐఏఎస్ కావడం నా లక్ష్యం: వి సురేశ్
నేను గ్రూప్-1 కొలువు సంపాదించడంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం మరువలేనిది. విద్యతో సమాజంలో మార్పు అనివార్యంగా వస్తుందని నేను భావిస్తున్నా. సొసైటీ ప్రగతి పథంలో సాగాలంటే విద్యనే ఆయుధమని నేను నమ్ముతాను.

అక్ష్యరాస్యతతో ఆటోమేటిక్గా అభివృద్ధి వైపు పయనం సాగుతుంది. నా లక్ష్యం ఐఏఎస్ కావడమే. ఏ పని అయినా క్రమశిక్షణ, శ్రద్ధతో చేస్తే మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. క్రమశిక్షణ, ఓపికతో చేసే పనికి భగవంతుడు సాయం చేస్తాడని నేను నమ్ముతాను. అయితే, నా విషయంలో ఆ మేరకు భగవంతుడి రూపంలో నాకు సాయం చేసింది స్నేహితులేనని నేను భావిస్తాను. నేను సొంతంగా ప్రతి సబ్జెక్ట్కు సిలబస్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు. యూపీఎస్సీకి, గ్రూప్-1 లో విజయం సాధించాలంటే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ అత్యావశ్యకం.

