• రైతు స్వరాజ్య వేదిక డిమాండ్
  • ధర్నాచౌక్‌లో నిర్వహించిన సభకు జమ్మికుంట రైతులు హాజరు

వేద న్యూస్, హైదరాబాద్:

2011 కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని రైతు స్వరాజ్య వేదిక(సంయుక్త కిసాన్ మోర్చా) డిమాండ్ చేసింది. ఆ వేదిక ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద సభ నిర్వహించారు.

సభలో వక్తలు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో 
రేవంత్ రెడ్డి కౌలు రైతులకు రాసిన బహిరంగ లేఖ స్ఫూర్తిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. రైతు కూడా రైతేనని, వారికి గుర్తింపు కార్డులు ఇచ్చి, రుణాలతో సహా అన్ని పథకాలను వర్తింపజేస్తూ 2011 లో కాంగ్రెస్ ప్రభుత్వమే కౌలు రైతుల గుర్తింపు చట్టం చేసిందని రేవంత్ తన లేఖలో పేర్కొన్నారని గుర్తుచేశారు.

వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి మాటనూ అమలు చేసి తీరుతామనీ, రైతులెవ్వరూ ఆధైర్యపడొద్దని రేవంత్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.  కౌలు రైతులు ఆ హామీ అమలు కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. ఆ రోజు బహిరంగ లేఖ రాసిన లేఖ రేవంత్ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన కౌలు రైతులకు తాను కల్పించిన భరోసాను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. 

ధర్నా చౌక్ సభలో జమ్మికుంట మండల పరిధిలోని పాపక్కపల్లె గ్రామ రైతులు సాకర్మాన్ వెంకటేశ్, ఎస్.రమేశ్, మెరుగు శ్రీనివాస్, జి.గట్టయ్య, పి.మహేశ్, జి.అంజి, వేముల ఐలయ్య, మెరుగు మధుకర్, పి.కుమార్, జే.శంకర్ పాల్గొన్నారు.