వేద న్యూస్, హైదరాబాద్ :

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్‌పేట్ డివిజన్‌లో బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాదయాత్ర నిర్వహించారు. రామాలయం ఆలయంలో ప్రత్యేక పూజలతో ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన, వినాయకనగర్, సీతానగర్, మారుతీనగర్ కాలనీల్లో ప్రజలను, ఓటర్లను కలిశారు. ప్రతి గడపకు వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటి గోడలకు బీజేపీ స్టిక్కర్లు అతికించి, ప్రచార పత్రాలను పంపిణీ చేస్తూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్పుల పాలుచేసిన రాష్ట్రాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల కోట్ల అప్పులతో మరింత కష్టాల్లోకి నెట్టిందని మల్క కొమరయ్య తెలిపారు. బీఆర్‌ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకే నాణానికి రెండు వైపులని, వీటికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందని అన్నారు.

ఈ ఉపఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదని, తెలంగాణ భవిష్యత్తు దిశను నిర్ణయించే ఎన్నికలని స్పష్టం చేశారు.మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని, ఆసరా పెన్షన్‌ను రూ. 4 వేలు పెంచుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.

తులం బంగారం వంటి మాయ మాటలతో ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసిందని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించి తెలంగాణలో మార్పుకు నాంది పలకాలని కోరారు. దీపక్ రెడ్డి ప్రజల సమస్యలపై పోరాడే నాయకుడని, అభివృద్ధి కోసం కృషి చేసే వ్యక్తి అని తెలిపారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, జూబ్లీహిల్స్ కూడా ఆ మార్పులో భాగమవ్వాలంటే కమలం గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

“మీ ఓటు మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కమలం పూవుకు ఓటు వేసి, బీజేపీని గెలిపించి, జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లండి,” అని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పిలుపునిచ్చారు.

రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్,రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్, అనిల్ గౌడ్,
బిజెపి స్టేట్ జనరల్ సెక్రటరీ వీరేందర్ గౌడ్, బిజెపి సీనియర్ రాష్ట్ర నాయకులు డా.రఘునాథ్ చారీ లతో పాటు డివిజన్ పార్టీ అధ్యక్షులు రాకేష్, సెంట్రల్ జిల్లా పార్టీ కౌన్సిల్ మెంబర్ శివ కుమార్, డివిజన్ ప్రభారి బంగారు ప్రకాష్, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.