వేద న్యూస్, హన్మకొండ ప్రతినిధి :
వరంగల్ మహా నగర ప్రాంత అభివృద్ధిలో మరో చారిత్రక ముందడుగు పడింది. స్పోర్ట్స్ స్కూల్ మరియు ఆధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.ఆదివారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు కడియం శ్రీహరి,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి,పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి,వర్ధన్నపేట శాసన సభ్యులు కే ఆర్ నాగరాజు,పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ లో స్పోర్ట్స్ అకాడమీ పాఠశాల మరియు క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలు వినతి పత్రం అందించారు.ఈ అభివృద్ధి ప్రతిపాదనను సీఎంకి వివరంగా విన్నవించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి,కావాల్సిన విధి విధానాలను రూపొందించాలని కోరారు.
ఎమ్మెల్యేలు ఐకమత్యం, కృషి ఫలితంగా ఈ మౌలిక సదుపాయాలు మంజూరు కావడం విశేషం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మహా నగర ప్రజల కలలుగా ఉన్న క్రీడా మైదానం ఇప్పుడు నెరవేరే దశలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులు యువతకు ఎంతో ఉపయోగపడతాయని ఆటల్లో ప్రతిభను వెలికితీసే మార్గంగా మారుతాయని తెలిపారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ ఒక్కొక నియోజకవర్గం, ఒక్కొక నాయకుని కాదు ఈ అభివృద్ధి మొత్తం వరంగల్ నగరానికి చెందింది. మనం అందరం కలిసి చేస్తే ఇలా సాధ్యమవుతుంది అన్నదానికి ఇది బలమైన ఉదాహరణ అని అన్నారు. ప్రత్యేకమైన స్పోర్ట్స్ అకాడమీ, ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానం వంటి ప్రాజెక్టులు, వరంగల్ నగరాన్ని క్రీడా రంగంలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేస్తాయని ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాగరాజు, యశస్విని రెడ్డిలు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభానికి సంబంధించిన భూమి, బడ్జెట్, కార్యాచరణ ప్రణాళికలు త్వరలోనే అధికారికంగా వెల్లడికాబోతున్నాయి.