ఇండోర్ స్టేడియం సందర్శనలో ఎమ్మెల్యే నాగరాజు

వేద న్యూస్, వరంగల్ టౌన్:

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వెనుకల గల ఇండోర్ స్టేడియాన్ని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సందర్శించి క్రీడాకారులతో మాట్లాడారు. అనంతరం కాసేపు క్రీడాకారులతో కలిసి ఎమ్మెల్యే బ్యాట్మెంటన్ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ
క్రీడారంగ బలోపేతంపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని, ఇండోర్ స్టేడియంలో మరిన్ని వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవలే హనుమకొండలోని జెఎన్ఎస్ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ ను ప్రారంభించామని, విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణిస్తూ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. యువత మత్తును వదిలి మైదానాలకు చేరుకోవాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, నేటి ఓటమే రేపటి గెలుపుకు నాంది అని అన్నారు.
క్రీడాకారులను ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన పారా అథ్లెట్ దీప్తి జీవాంజీకి ప్రభుత్వం కోటి రూపాయల నగదు అందించి ప్రోత్సహించిందని, భవిష్యత్తులో ఓరుగల్లు నుంచి క్రీడాకారులు రాష్ట్ర, దేశస్థాయిలో రాణిస్తూ జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.