- కలిసిరానున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పని చేసిన అనుభవం
- ఆశావహుల్లో ముందు వరుసలో సుంకరి ఉమామహేశ్వరి రమేష్
- జమ్మికుంట మార్కెట్ యార్డు పాలకవర్గ చైర్మన్కు తీవ్రపోటీ
- హస్తం పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన నేతగా రమేశ్కు పేరు
- హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాలతో విస్తృత సంబంధాలు
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి పోటీ తీవ్రంగా మారింది. చైర్మన్ గిరి కోసం పలువురు ఎవరికి వారు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. కాగా, చైర్మన్ ఆశావహుల్లో ముందు వరుసలో సుంకరి ఉమామహేశ్వరి రమేష్ పేరు వినబడుతోంది.
కాంగ్రెస్ పార్టీ విధేయుడు రమేశ్..
కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ.. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేసిన నిబద్ధ కార్యకర్త సుంకరి రమేష్. ఏండ్లుగా పార్టీలో కొనసాగుతూ.. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రజలు, వ్యాపారస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజానీకంతో విస్తృత సంబంధాలు కలిగిన సుంకరి ఉమామహేశ్వరి రమేష్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేసులో ముందు వరుసలో నిలుస్తున్నారు.
ఏండ్లుగా పార్టీ బలోపేతానికి సేవలు
2000 సంవత్సరం నుంచి హస్తం పార్టీలో కార్యకర్తగా మొదలై.. నాయకుడిగా పార్టీలో ఎదిగి.. పార్టీకి విశేష సేవలు అందిస్తున్నారు. జననేత, దివంగత సీఎం డాక్టర్ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు శ్రేణుల్లో మనోధైర్యాన్ని నింపి.. అధికారం దరిదాపుల్లో లేని సమయంలో పార్టీ నే నమ్ముకుని సేవలందించారు. సుంకరి రమేష్ ఆనాటి అధికార పార్టీ బీఆర్ ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో చైతన్యాన్ని నింపారు. టిపిసిసి అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పాదయాత్రలో కీలకంగా వ్యవహరించారు. సహజ వనరులు ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో కాంగ్రెస్ నాయకుడు రమేష్ క్రియాశీలకంగా వ్యవహరించారు.
శ్రేణులకు రమేశ్ ఆపన్న హస్తం
కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఆపన్న హస్తం అందిస్తూ.. సొంత డబ్బులతో కార్యక్రమాలను నిర్వహించడం లోనూ వెనకాడ లేదు. కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జి ప్రణవ్ వొడితల ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నారు. రమేశ్ 2005లో జమ్మికుంట పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షఉడిగా నియమితులయ్యారు. 2009లో అపరభద్రాద్రి ఇల్లందకుంట దేవస్థాన కమిటీ సభ్యుడిగా నియమితులై పని చేశారు. 2010 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు జమ్మికుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా పని చేసి.. ప్రస్తుతం జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీకి సేవలందిస్తున్నారు.
కలిసి రానున్న గత అనుభవం
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా సేవలందిస్తున్న రమేష్.. తనకు పార్టీలో ఉన్న విస్తృత అనుభవం పరిజ్ఞానం నేపథ్యంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నారు. చైర్మన్ గిరి రేసులో రమేష్ అభ్యర్థిత్వం ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇల్లందకుంట దేవస్థాన కమిటీ సభ్యుడిగా, రెండు పర్యాయాలు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా సేవలందించిన సుంకర రమేష్ కు చైర్మన్ గిరి దాదాపుగా ఖరారు అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేసులో ఉన్న వారిలో రమేష్ అభ్యర్థిత్వం అందరికంటే ముందున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం.