- చైర్ పర్సన్ పదవి ఆశిస్తున్న టీజేఎస్ రాష్ట్ర నాయకురాలు స్రవంతి
- కాంగ్రెస్తో పొత్తులో భాగంగా చైర్మన్ గిరి కోసం ప్రయత్నాలు
వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. చైర్మన్ గిరి కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాల్లో వారు తలమునకలవుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి.
అధికార కాంగ్రెస్తో ఉన్న పొత్తులో భాగంగా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పీఠం టీజేఎస్కు కేటాయించాలనే కోరుతున్నట్టు తెలుస్తున్నది.కాంగ్రెస్ గెలుపు కోసం ప్రొఫెసర్ కోదండరాం (తెలంగాణ జన సమితి) టీజేఎస్ పార్టీ తన వంతుగా కీలక భూమిక పోషించింది. జమ్మికుంట పట్టణానికి చెందిన అరికిల్ల స్రవంతి ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆమె జమ్మికుంట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పదవిని ఆశిస్తున్నారు.
తెలంగాణ జనసమితి(టీజేఎస్) పార్టీ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఉద్యమసారథి ప్రొఫెసర్ కోదండరాం అడుగుజాడల్లో నడుస్తూ కార్యకర్త స్థాయి నుండి జిల్లా కమిటీ సభ్యురాలుగా, రాష్ట్ర మహిళా విభాగం కో కన్వీనర్గా ప్రస్తుతం జన సమితి మహిళా విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. జిల్లాలో జనసమితి పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేసిన స్రవంతి.. గత రెండు సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేశారు.
టీజేఎస్ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు అండదండలు, ప్రోత్సాహంతో స్రవంతి జనసమితి పార్టీలో కార్యకర్త స్థాయి నుండి జన సమితి మహిళా విభాగానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కుదిరిన పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పని చేసిన జనసమితి పార్టీకి పొత్తులో భాగంగా కొన్ని నామినెటేడ్ స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసమితి పార్టీకి సముచిత స్థానం ఇవ్వాలని ఆ పార్టీ లీడర్లు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో కీలకంగా ఉన్న స్రవంతి జమ్మికుంట మార్కెట్ చైర్మన్ పదవి ఆశిస్తున్నట్టు సమాచారం. రాజకీయ చైతన్యం కలిగి ఉండి..విద్యావంతురాలిగా ఉన్న ఆమెకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పదవిని అప్పగించినట్లయితే సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారనే ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.