వేద న్యూస్, నల్లబెల్లి :

నల్లబెల్లి మండలం ఎస్సీ కాలనీలో స్తంభాల మధ్య విద్యుత్ తీగలు ఇండ్లపై వేలాడుతుండటంతో.. వర్షాల నేపథ్యంలో దళిత కుటుంబాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నాయి. ఈ విషయాన్ని  “వేద న్యూస్”  తెలుగు దినపత్రిక శుక్రవారం ప్రధాన సంచికలో “పొంచి ఉన్న ప్రమాదం!” అనే శీర్షికతో వార్తా కథనాన్ని ప్రచురించగా, సదరు కథనానికి స్పందన వచ్చింది.  మండల విద్యుత్ అధికారి హరిబాబు స్పందించి.. దళిత కాలనీలో పర్యటించి సమస్యను పరిశీలించారు.

ఇండ్లపై విద్యుత్ తీగలు వేలాడుతున్న దృశ్యాన్ని చూసి.. వర్షాలు తగ్గిన వెంటనే ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అధికారుల స్పందనతో ప్రజల్లో కొంత ఊరటవచ్చింది.

ప్రాణహాని ప్రమాదాన్ని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్న స్థానికుల డిమాండ్‌కు అధికారులు స్పందించిన తీరు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ప్రజా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేసిన  “వేద న్యూస్”  తెలుగు దినపత్రిక కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.