వేద న్యూస్, వరంగల్ టౌన్ : వరంగల్ ఓ సిటీ క్లబ్ లో వరంగల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా మీసాల ప్రకాష్ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతోకాలంగా కష్టపడ్డ మీసాల ప్రకాశ్కు ఈ పదవి దక్కడం ఆనందంగా ఉందని, ఇందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు సముచిత గుర్తింపు ఇస్తామని చెప్పారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. తూర్పు నియోజకవర్గంలో కమ్యూనిటీ హాళ్లు, స్మశానవాటికల ప్రహరీలు, అండర్ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నేరుగా అధికారులకు పంపించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొండా మురళీధర్ రావు నాయకత్వంలో వరంగల్ తూర్పును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడంలో మీసాల ప్రకాశ్ కీలక పాత్ర పోషించాలని మంత్రి మంత్రి సురేఖ ఆకాంక్షించారు.
