- కలెక్టర్ చాహత్ బాజ్పాయ్
వేద న్యూస్, హనుమకొండ:
హనుమకొండ జిల్లా హంటర్ రోడ్డులోని కాకతీయ జూలాజికల్ పార్క్ లో అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా హన్మకొండ జిల్లా ఫారెస్ట్ డిపార్ట్మెంమెంట్, ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ (ఔల్స్) ఎన్.జీ.ఓ. తెలంగాణ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలంటే వన్యప్రాణులను రక్షించడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో భాగంగా వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంపొందించేందుకు ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ (ఔల్స్) ఎన్.జీ.ఓ. తెలంగాణ వారు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు.
పర్యావరణ, సహజ వనరుల, అడవుల, అటవీ జంతువుల సంరక్షణపై సేవ సహకారం, స్వచ్చంద సంస్థ చేస్తున్న అవగాహణ కృషిని అభినందించారు. అంతేకాకుండా పులుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి ముకుందరెడ్డి, అటవీ అధికారులు ఎఫ్.ఆర్.ఓ. మయూరి, బీట్ ఆఫిసర్స్ శిరీష, శ్రీనివాస్, ఓరుగల్లు వైల్డ్లైఫ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి చెల్పూరి శ్యామసుందర్, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థుల తల్లితండ్రులు, జూ సిబ్బంది పాల్గొన్నారు.

