= 40వ డివిజన్ 2వ బ్లాక్లో విషాదం
= ఇద్దరు ఆడపిల్లలతో నిరాశ్రయులైన రజక కుటుంబం
= తక్షణమే స్పందించి న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి
వేద న్యూస్, వరంగల్ టౌన్ :
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరంలోని 40వ డివిజన్, 2వ బ్లాక్లో విషాద ఘటన చోటుచేసుకుంది. రాముల శ్రీను అనే వ్యక్తికి చెందిన నివాస గృహం వర్షాల ధాటికి పూర్తిగా కూలిపోవడంతో కుటుంబం ఒక్కసారిగా నిరాశ్రయులైంది. ఇంట్లో నివసిస్తున్న రాముల శ్రీను, ఆయన కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఇద్దరు ఆడపిల్లలతో కలిసి రోడ్డుపై ఆశ్రయం పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఇంటి సామగ్రి, అవసరమైన వస్తువులు కూడా దెబ్బతినడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
స్థానికులు వెంటనే స్పందించి కుటుంబానికి తాత్కాలిక సహాయం అందించినప్పటికీ, ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు అత్యవసరంగా స్పందించి బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం, తాత్కాలిక నివాసం, అలాగే శాశ్వత గృహ నిర్మాణానికి అవసరమైన సహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రకృతి విపత్తుతో రోడ్డున పడిన ఈ రజక కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

