- బీజేపీ నేతల వినూత్న నిరసన
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి :
వరంగల్ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాయల మరాఠీ పార్టీలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వరంగల్ బస్టాండ్ పేరుతో నయవంచన చేస్తే.. ప్రస్తుత ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ అసమర్థతతో బస్టాండ్ నిర్మాణానికి నోచుకోవడం లేదని మండిపడ్డారు. చారిత్రక నగరమైన వరంగల్కు బస్టాండ్ నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు పడకపోవడంతో వరంగల్ ఆత్మగౌరవ పోరాటం మహా ధర్నా- 2 పేరుతో గురువారం బీజేపీ వరంగల్ బస్టాండ్ ఏర్పాటు ప్రాంతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులకు ఉచిత పడవ ప్రయాణం వినూత్న నిరసన చేపట్టింది.
రాష్ట్ర రెండో రాజధానిగా వరంగల్ను తీర్చిదిద్దుతామంటూ ప్రగల్భాలు పలుకుతున్న సర్కారు.. కనీసం వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులను చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రిగా ఉన్నా.. పట్టించుకోకపోవడం ఆమె అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. ఎన్నికల ముందు అప్పటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కోట్ల రూపాయలతో కొత్త బస్టాండ్ నిర్మిస్తామంటూ ఇదిగో.. నమూనా బస్టాండ్ అంటూ మాయమాటలు చెప్పి ఉన్నదానిని కూల్చాడని మండిపడ్డారు.
ఆ తర్వాత కనీసం అటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు. కాకతీయుల ఆర్థిక రాజధానిగా, పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న వరంగల్కు కనీసం బస్టాండ్ లేకపోవడం ఏంటని పర్యాటకులు ముక్కుమీద వేలు వేసుకుంటున్నారని వాపోయారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హృదయ్, అమృత్, స్మార్ట్ సిటీ వంటి ఎన్నో పథకాలకు భారీగా నిధులు కేటాయించి వరంగల్ను ప్రగతిదారిలో నడిపిస్తుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం ఓరుగల్లు చరిత్రను భ్రష్టు పట్టిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు.
వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు ఒక్కఅడుగు ముందుకు పడకపోయినా ఇక్కడి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రెండు పార్టీలకు ఓట్లు తప్ప వరంగల్ అభివృద్ధిపై కనీస పట్టింపులేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదల భూముల్ని కబ్జా చేయడంలో.. సెటిల్మెంట్ పనుల్లో ఆ పార్టీల నేతలు బీజీబిజీగా ఉన్నారని, ఇక వారికి ప్రజా సమస్యలు ఏం పడతాయంటూ ఆరోపించారు.
ఓరుగల్లు సమగ్రాభివృద్ధి, అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం బీజేపీ పాటు పడుతుందన్నారు. ఓరుగల్లు అభివృద్ధి కోసం ఇక ఉద్యమాన్ని ఉధృతం చేసి ఉమ్మడి జిల్లా మంత్రుల మరియు శాసనసభ్యుల ఇండ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కుసుమ సతీష్, రత్నం సతీష్, మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, జలగం రంజిత్ రావు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గజ్జేల శ్రీరాములు, జిల్లా, మండల పదాధికారులు, వివిధ మోర్చా జిల్లా అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు మహిళా మోర్చా పాల్గొన్నారు.
