•  ఫిర్యాదు చేసి 2 నెలలు దాటినా పట్టించుకోని డీఎంహెచ్ వో!?
  •  ప్రైవేట్ ఆస్పత్రి పై ఆఫీసర్ల ఉదాసీన వైఖరి?
  •  చర్యలకు మీనమేషాలు లెక్కిస్తున్న వైనం!
  •  ప్రైవేట్ ఆస్పత్రులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వత్తాసు?

వేద న్యూస్, జమ్మికుంట:
జమ్మికుంట పట్టణానికి చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రి పై ఫిర్యాదు రాగా, చర్యలకు పూనుకోకుండా సదరు ఆసుపత్రి పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మమతానురాగాలు చూపుతున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకెళితే.. జమ్మికుంట పట్టణానికి చెందిన మమత ఆసుపత్రి నిర్లక్ష్యంపై బాధితుడు ఫిర్యాదు చేసి సుమారు 2 నెలలు గడుస్తున్నా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి పట్టించుకోవడం లేదు. ఆధారాలతో సహా హాస్పిటల్ లో జరిగిన తప్పిదంపై బాధితుడు ఏప్రిల్ 25న కంప్లయింట్  చేశారు.

థైరాయిడ్ టెస్ట్ కోసం రక్త నమూనాలను ఇచ్చినప్పటికీ నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించి.. శాంపిల్ మిస్ చేసి మళ్లీ బ్లడ్ ఇవ్వండి అంటూ మమత ఆసుపత్రి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ ఘటన పై పట్టణానికి చెందిన బాధితురాలు భర్త రచ్చ రవి కృష్ణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి పై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

చర్యలకు హామీ ఇచ్చినట్లే ఇచ్చి ఉదాసిన వైఖరితో డిఎంహెచ్వో వ్యవహరిస్తున్నట్టు బాధితుడు తెలిపారు. ఆస్పత్రిలో జరిగిన తప్పిదం వల్ల బాధితురాలు మరింత అనారోగ్యం పాలయింది. ఆస్పత్రి పై యాక్షన్ తీసుకోవాలని కోరుతూ బాధితుడు జిల్లా కేంద్రానికి నాలుగు సార్లు నేరుగా వెళ్ళగా, చర్యలు తీసుకుంటామని చెబుతూ అధికారి దాటవేస్తూ వచ్చారు.

ఈ విషయమై  పలుమార్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ఫోన్ లో  సంప్రదించగా అందుబాటులోకి రావడం లేదు. దీంతో సదరు అధికారి ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మకయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయం కోసం పలుమార్లు జిల్లా కేంద్రానికి వెళ్లి వచ్చినా ఉన్నతాధికారులు పట్టించుకోక వడంపై బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారిపై సైతం రాష్ట్ర రాజధానిలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు స్పష్టం చేశారు.