వేద న్యూస్, వరంగల్:
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నది. రైతులు పంటలను పత్తి మొక్కజొన్న వరి మొదలగు పంటలకు కాంప్లెక్స్ ఎరువులతో పాటు యూరియాను కూడా వాడుతారని న్యూ డెమోక్రసీ, ఏఐకేఎంఎస్ నాయకులు తెలిపారు. గత 15 రోజులుగా రైతులు యూరియా కోసం సొసైటీల దగ్గర బారులుగానిలబడితే అనుకున్నంత యూరియా బస్తాలు వారికి అందక పోవడంతో ఆందోళన చెందుతున్నారని నాయకులన్నారు. చిన్న సన్న కారు రైతులు ఎకరం నుండి నాలుగు ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నారని వారికి ఒక్క యూరియా బస్తా మాత్రమే ఇవ్వడం వల్ల సరిపోవడం లేదని అన్నారు.
ఇదే అదనుగా జిల్లాలోని మండల కేంద్రాల్లో మేజర్ గ్రామపంచాయతీ గల గ్రామాల్లో ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులు నడుపుతున్న వ్యాపారులు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నారని కలెక్టర్ కు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఇతర విజిలెన్స్ అధికారులు కూడా ఆయా వ్యాపారస్తుల షాపులను తనిఖీ చేసి రైతులకు యూరియా అందించే విధంగా చర్యలు చేపట్టాలని వారు జిల్లా కలెక్టర్ ను కోరారు. కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు సొసైటీల నుండి తమకు అనుకూలమైన వారికే బస్తాలు ఇప్పించి రైతులకు మొండి చేయి చూపిస్తున్నారని ఆరోపించారు. వరంగల్ నగరంతో పాటు జిల్లాలో కొంతమంది వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారని వారిని గుర్తించి చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. జిల్లాలో రైతులకు తగినంత యూరియాను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ సోమవారం వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కి కలిసి వినతి పత్రం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎలకంటి రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి గంగుల దయాకర్, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచర్ల బాలరాజు, మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు,నాయకులు గట్టి కృష్ణ, బండి కుమార్, జి అశోక్, ఇనుముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.