Screenshot

వేద న్యూస్, ముస్తాబాద్ :

పనుల జాతర 2025 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ పనుల జాతర 2025 లో భాగంగా ఆవునూరు గ్రామంలో (క్యాటల్ షెడ్) పశువుల పాక నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్, ఉపాధి హామీ పథకం , పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా చేపట్టబోయే కొత్త పనులను మన జిల్లాలో ప్రారంభించడానికి పనుల జాతర 2025 అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.
జిల్లాలోని 12 మండలాల పరిధిలోని అన్ని 260 గ్రామాలలో నేడు “పనుల జాతర-2025“ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉపాధి హామీ పథకం, ఆర్.డబ్ల్యూ.యస్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, స్వచ్ఛభారత్ వంటి విభాగాలలో చేపట్టనున్న పనులకు ఈ సందర్భంగా భూమి పూజలు చేస్తున్నామని అన్నారు.నూతన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్ వాడీ భవనాలు, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) ద్వారా చేపట్టిన సెగ్రిగేషన్ షెడ్, కమ్యూనిటీ సానిటరీ కాంప్లెక్స్, “ఇందిరా మహిళా శక్తి – ఉపాధి భరోసా” క్రింద వ్యక్తిగత ఆస్తుల కల్పన పనులు అనగా పశువుల కొట్టం, కోళ్ళ షెడ్, గొర్రెల షెడ్, పండ్ల తోటలు, వానపాముల ఎరువుల తయారీ, అజోలా పిట్ నిర్మాణం, “జలనిధి” క్రింద వాన నీటి సంరక్షణ-భూగర్భ జలాలు పెంచే ఫారమ్ పాండ్స్, ఊట కుంటలు వంటి పనులకు ఈ కార్యక్రమం కింద చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ శేషాద్రి, ఈ.ఈ పి.ఆర్. సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.