ధర్మ సేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
వేద న్యూస్, హనుమకొండ :
హనుమకొండలోని కేయూ ఎంప్లాయీస్ కాలనీలో ఉన్న జయశంకర్ కమ్యూనిటీ హాల్లో ధర్మ సేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్, విశిష్ట అతిథి వి. విమల (డీఎల్పిఓ) , ఉపాధ్యాయులు పద్మ, అరుణ, లెక్చరర్ మాధవి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళల సాధికారత, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర, మహిళల హక్కులు మరియు అవకాశాలపై అతిథులు ప్రసంగించారు. మహిళలు విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు వంటి విభిన్న రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ సమాజ పురోగతికి విశేషంగా దోహదపడుతున్నారని వారు పేర్కొన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం ద్వారా సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ధర్మ సేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు శ్రీకాంత్ అనగంటి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి మరియు సాధికారత కోసం సమాజంలోని ప్రతి వర్గం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, విద్యా మరియు ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడం, వెనుకబడిన మహిళలకు సహాయం అందించడం తమ సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సౌజన్య – నర్సయ్య కీలక పాత్ర పోషించారు. కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, శ్రీలేఖ, శోభ, మనసా, చంద్ర మౌళి, సంతోష్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.