• బీజేపీ ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యదర్శి రాజేశ్ ఠాకూర్

వేద న్యూస్, జమ్మికుంట:
‘దళిత బంధు’ రెండో విడత అమలు చేయాలని, లబ్ధిదారుల అకౌంట్లపైనున్న ఫ్రీజింగ్ తొలగించి నిధులు లబ్ధిదారులకు అందజేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా కరీంనగర్ జిల్లా కార్యదర్శి రాజేశ్ ఠాకూర్ కోరారు. మంగళవారం ఆయన ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ఉప ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలో ‘దళిత బంధు’ స్కీంను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 18,021 కుటుంబాలకు 10 లక్షల చొప్పున వారి ఖాతాలలో గత ప్రభుత్వం క్రెడిట్ చేసిందని గుర్తుచేశారు. ఆ మొత్తాన్ని లబ్ధిదారునికి 2 విడతలుగా ఇస్తాం అని చెప్పి…ఎలక్షన్ ఉన్నది అని సాకుగా చూపెట్టి రెండో విడత డబ్బులు ఇవ్వకుండా 4,900 కుటుంబాలను అప్పటి బీఆర్ఎస్ సర్కారు రోడ్డు మీద పడేసిందని విమర్శించారు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో రెండో విడత డబ్బులను అకౌంట్లను ఫ్రీజ్ చేసి లబ్ధిదారులను అయోమయానికి గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ‘దళిత బంధు’ రెండో విడత రాదని తాజాగా మనస్తాపంతో ఆత్మహత్యయత్నానికి బాధితులు ప్రయత్నించారని చెప్పారు. ఆ కుటుంబాలకు బీజేపీ తరఫున అండగా ఉంటామని రాజేశ్ స్పష్టం చేశారు.

ఈ పైలట్ ప్రాజెక్టును ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనసాగింపు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లబ్ధిదారుల అకౌంట్లో ఉన్న డబ్బులను విడుదల చేయడానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఇబ్బంది ఏమిటో చెప్పాలని కోరారు. వాసాలమర్రి గ్రామంలో రూ.10 లక్షలు ఒకేసారి లబ్ధిదారులకు అందజేశారని గుర్తుచేశారు. అదే హుజురాబాద్ లో రెండు విడతలుగా విభజించి లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నారని వివరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ‘దళిత బంధు’ రెండో నిధులు విడుదల చేయాలని కోరారు.