వేద న్యూస్, వరంగల్ టౌన్ :
జీవితం జీవించడానికే, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం వరంగల్ లో ఆత్మహత్యల నివారణ కమిటీ మరియు సైకాలజిస్ట్ ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ సదస్సుల కరపత్రాలు మరియు బ్రోచర్లను విడుదల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తుల పట్ల, సమాజం స్వాంతన చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలన్నారు. తనకి ఎవరూ లేరనే అగాధాన్ని పూడ్చే ప్రయత్నంతో భరోసా నింపాలని, కష్టాల్లో ఉన్న వ్యక్తికి తనకు ఉన్న అన్ని దారులు మూసుకుపోయినప్పుడే ఆత్మహత్య ప్రయత్నం అనే దారి తెరుచుకుంటుందని తెలిపారు. ఆ ప్రమాదకర క్షణంలో మేమున్నామంటూ భరోసానిస్తే బయటపడతారని తెలిపారు. గత పది సంవత్సరాలుగా ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తూ ఇప్పటివరకు 28 మంది జీవితాలను కాపాడటం సంతృప్తి నిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మట్టేవాడ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి, భారతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.