•  ఎనిమిదో రోజుకు మిట్టపెల్లి అరవింద్ ధర్నా
  •  వరంగల్ జిల్లా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దళితరత్న నమిండ్ల చిన్నస్వామి మద్దతు
  •  వారసత్వంగా అరవింద్‌కు రావాల్సిన వాటా ఆస్తిని ఇవ్వాల్సిందేనని డిమాండ్

వేద న్యూస్, వరంగల్:
‘వారసుడి న్యాయపోరాటం’ శీర్షికన ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ఈ నెల 1న ప్రచురితమైన కథనానికి ప్రజాసంఘాలు స్పందించాయి. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి(హవేలి)లో తన తండ్రి ఆస్తిలో వాటా కోసం తనయుడు ధర్నా చేస్తున్నాడు. తల్లితో కలిసి ఊరిలో టెంట్ వేసుకుని తండ్రి ఫొటోతో నిరసన తెలుపుతున్నాడు.

వివరాల్లోకెళితే.. ఎలుకుర్తి గ్రామవాస్తవ్యులు మిట్టపల్లి రాజేశ్వర్‌కి ముగ్గురు కుమారులు.. పెద్ద కుమారుడు కరుణాకర్, రెండో కుమారుడు శ్రీనివాస్, మూడో కుమారుడు రాజు. కాగా, 17 ఏళ్ల క్రితం మిట్టపల్లి శ్రీనివాస్ చనిపోయారు. తన కుమారుడైన మిట్టపల్లి అరవింద్.. తన తల్లి స్వరూపతో కలిసి తమకు రావలసిన ఆస్తి కోసం ధర్నా చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న విజిలెన్స్ కమిటీ మెంబర్ నమిండ్ల చిన్నస్వామి సోమవారం ఆ గ్రామానికి వెళ్లారు.

అరవింద్ చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు. వాటా ప్రకారం అరవింద్ కు రావాల్సిన ఆస్తిని ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. మిట్టపల్లి అరవింద్‌కు రావలసిన ఆస్తి మూడెకరాల విషయమై.. పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడినా అరవింద్ పెదనాన్న, బాబాయ్‌లు అంగీకరించడం లేదని చెప్పారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లినా వారు స్పందించడం లేదని చెప్పారు.

వారి తీరు ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున దళిత సంఘాల నాయకులమంతా ఏకమై.. వారికి న్యాయం జరిగే వరకూ వారి వెంటే ఉంటామని స్పష్టం చేశారు. అరవింద్‌కు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటామని చెప్పారు. భీమగాని సౌజన్య కూడా అరవింద్ న్యాయపోరాటానికి మద్దతు తెలిపారు. త్వరలో పరిష్కార మార్గాన్ని చూపుతామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *