- రైతు స్వరాజ్య వేదిక
- గుర్తింపునకు నోచని కౌలురైతులు
వేద న్యూస్, ఇల్లందకుంట:
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల పరిధిలోని సిరిసేడు గ్రామంలో రైతు స్వరాజ్య వేదిక సంస్థ ఆధ్వర్యంలో కౌలు రైతుల గురించి బుధవారం సర్వే చేశారు. రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న వారిలో 36 శాతం కౌలు రైతులే ఉన్నారని, వీరికి సరియైన గుర్తుంపు లేక ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం అందక, అప్పుల బాధతో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రైతు స్వరాజ్య వేదిక వారు తెలిపారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదని వెల్లడించారు. గత కాంగ్రెస్ ప్రభత్వం 2011 లో కౌలు రైతుల అధీకృత సాగుదారుల చట్టం తెచ్చి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆ చట్టం అమలు చేయకపోవడం వలన కౌలు రైతు గుర్తింపునకు నోచుకోవడం లేదని వెల్లడించారు.
పంటను అమ్మడంలో వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారని వివరించారు. ఈ ప్రభుత్వం సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నదని, మరి కౌలు రైతులకు ఎలా అందిస్తున్నారు? వారికి బోనస్ వస్తుందా లేదా ? అనే విషయమై సర్వేలో అడగగా, భూమికి కౌలు ధరలు ఈ బోనస్ వచ్చిన నాటి నుంచి పెరిగాయనే విషయం తెలిసిందని వివరించారు.
కార్యక్రమం లో రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కో ఆర్డినేటర్ కొండల్రెడ్డి, సామాజిక కార్యకర్త వంగ రామకృష్ణ, రైతు స్వరాజ్య వేదిక సభ్యులు రాచపల్లి సమ్మయ్య, ఇంజం చైతన్య, సాకర్మాన్ వెంకటేశ్, ముక్క శశికుమార్, కొమ్మరాజుల అనూష , కొలుగురి స్వర్ణలత, కాయిత అన్నపూర్ణ, హైదరాబాద్ సెంట్రల్ విద్యార్ధిని శ్రీ హిత, గ్రామస్తులు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.