కమిషనర్ చాహత్ బాజ్ పాయ్
వేద న్యూస్, కాజీపేట :
కాజీపేట మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ నగర పరిధి లోని ఖాజీపేట మార్కెట్ బాల సముద్రం ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి లో సందర్శించి సమర్థవంతం గా నిర్వహించుటకు అధికారులకు తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్ల మీద వ్యాపారాలు నిర్వహించడం వల్ల వినియోగదారులు మార్కెట్ లోకి రావడంలేదని కాజీపేట మార్కెట్ కు సంబంధించి స్థానిక మార్కెట్ దారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రోడ్డు మీద కూరగాయలు అమ్మే వారిని మార్కెట్ లో వ్యాపారాలు నిర్వహించుకునేలా చూడాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ లు ఓపెన్ చేసి మటన్ చికెన్ విక్రయించే దుకాణాలను అక్కడే వ్యాపారాలు నిర్వహించేలా చూస్తూ మార్కెట్ ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. కూరగాయల మార్కెట్ యందు పోలీసు, పట్టణ ప్రణాళిక విభాగం ఇంజనీరింగ్ విభాగాల సమన్వయంతో స్ట్రీమ్ లైన్ చేసి వీధి వ్యాపారులకు ఉపాధి అందేలా చూడాలని, స్లాటర్ హౌస్ చిన్నగా ఉందని ఇందుకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అవకాశం ఉంటే నూతన వదశాల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. బాలసముద్రంలోని కోకో పిట్ యూనిట్ ను పరిశీలించిన కమిషనర్ నిర్వహణ బాగుందని కొబ్బరి బొండాల వ్యర్థాలు ఎక్కువగా పేరుకు పోయి ఉన్నాయని వేగవంతంగా ప్రాసెసింగ్ చేసి నిల్వ లేకుండా చూడాలని ఈ యూనిట్ కార్పొరేషన్ కు మోడల్ గా నిలుస్తుందని 50 కిలో గ్రామ ల బల్క్ వేస్ట్ జనరేటర్ ను కమిషనర్ పరిశీలించారు. వర్మీ కంపోస్ట్ యూనిట్ చాలా బాగుందని దీనిని మరింత బలోపేతం చేయడానికి మరో షెడ్ ను ఏర్పాటు చేసి సామర్థ్యాన్ని పెంచాలని ఈ ఈ నీ ఆదేశించారు. బయో మిథనైజేషన్ ప్లాంటుకు మరమత్తులు చేపట్టి పునరుద్ధరించాలని అలా కాని పక్షంలో ఇదే ప్రాంతం లో నూతన బయో మిథనైజేషన్ ప్లాంటు ఏర్పాటు కు చర్యలు చేపట్టాలని విండ్రో కాంపోస్టు యూనిట్ ఉన్న ప్రాంతంలో నీరు చేరుతుందని దానిని అరికట్టడానికి అక్కడ మొరం వేసి అరికట్టి బలోపేతం చేయాలని కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో సి.ఎం.హెచ్.ఓ డా. రాజారెడ్డి, వెటర్నరీ వైద్యులు డాక్టర్ గోపాలరావు, ఈఈ రవి కుమార్, డిఈ సారంగం, ఏఈలు రాగి శ్రీకాంత్, మేనక, సానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, వావ్ ప్రతినిధి పవన్ తదితరులు పాల్గొన్నారు.