గోశాల పరిసరాలు నిత్యం శుభ్రంగా ఉండాలి*
*కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
*అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల, ఆకస్మిక తనిఖీ
వేద న్యూస్ ,వేములవాడ:
వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ లో నిర్మాణాల కూల్చివేత పనులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. తిప్పాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న పలు నిర్మాణాలను అధికారులు సోమవారం ఉదయం కూల్చి వేయిస్తుండగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాసితులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రోడ్డు నిర్మాణంతో భక్తులు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు.
గోశాలలో ఆకస్మిక తనిఖీ

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన తిప్పాపూర్ లోని గోశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా గోశాలలోని జీవాలు, ఆవరణను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. గోశాల ఆవరణను నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. ఇటీవల నియమించిన సిబ్బందికి డ్రెస్ కోడ్ వారి పేర్లతో ఉండాలని సూచించారు. జీవాల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సంరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.
విద్యార్థులతో పాఠాలు చదివించి..

తిప్పాపూర్ లోని ప్రాథమిక పాఠశాలలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాఠాలు చదివించారు. ప్రతి విద్యార్థితో అన్ని పాఠ్యాంశాలు నిత్యం చదివించాలని, రాయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు అందిస్తున్న కోడిగుడ్లు, ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ పాఠాలు బోధించాలని సూచించారు.కార్యక్రమంలో వేములవాడ ఆర్డీవో రాధాబాయి, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.