వేద న్యూస్, మహబూబాబాద్/మరిపెడ:

జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్ ల తో కలిసి NDRF(జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం) అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఈ సమావేశంలో విపత్తు నిర్వహణ, తక్షణ చర్యలు, సహాయ కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో ప్రకృతి విపత్తులు, ముఖ్యంగా వరదలు, భూకంపాలు, తుపాన్లు వంటి అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారు.

NDRF బృందం విపత్తు సమయంలో ప్రజలను రక్షించే విధానాలు, సహాయ చర్యలు, అత్యవసర సేవల అందుబాటును మెరుగుపరచడం, విపత్తు నివారణ చర్యలపై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించింది. అలాగే, మునుపటి అనుభవాలను పరిగణనలోకి తీసుకుని, విపత్తు నిర్వహణలో మెరుగైన విధానాలను అమలు చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సమన్వయం అత్యంత కీలకమని, విపత్తు సమయంలో వేగంగా స్పందించే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముందస్తు ప్రణాళికలు, అప్రమత్తతతో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని తెలిపారు.

NDRF బృందం త్వరలో జిల్లాలో విపత్తు నిర్వహణ మాక్ డ్రిల్ (అభ్యాసం) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.

జిల్లాలో 20 మందితో కూడిన NDRF సిబ్బంది మంగళవారం నుండి ఆగస్ట్ 14 వ తేదీ వరకు మునిసిపాలిటీలలో, గ్రామాలలో అవేర్ నేస్ కార్యక్రమాలు నిర్వహిస్తారని వాలంటీర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇందులో పాల్గొని ఏదైనా విపత్తు సమయంలో తక్షణ సహాయం పై శిక్షణ ఇస్తారని అన్నారు.

ఈ సమావేశంలో మహబూబాబాద్ ఆర్డిఓ కృష్ణవేణి, జెడ్.పి. సీఈఓ పురుషోత్తం, డి.ఆర్.డి.ఓ మధుసూదన రాజు, జిల్లా అధికారులు, NDRF ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్, ఎ.ఎస్.ఐ. ప్రదీప్ కుమార్, నరేందర్ సింగ్, రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్, మునిసిపల్, విద్యుత్, రోడ్లు-భవనాలు, తాగునీరు తదితర శాఖల అధికారులు, కలెక్టరేట్ ఎ.ఓ పవన్ కుమార్ సమావేశంలో పాల్గొన్నారు.