వేద న్యూస్, హుజురాబాద్ ప్రతినిధి:
‘‘నా చివరి ఊపిరి వరకు కేసీఆర్ తోనే, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటానని’’ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి హుజురాబాద్ టికెట్ ఇవ్వడంతో పాటు గత కొంతకాలంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన కేసీఆర్ కే తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డితో కలిసి దిగిన ఫొటోను..ఇప్పటి ఫొటోగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఊపిరి ఉన్నంతవరకు కేసీఆర్ అడుగుజాడల్లోనే నడుస్తానని వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తనపై అభిమానం చూపించారని చెప్పారు. ఓటు వేసిన ప్రతీ ఒక్కరికి సలాం చెప్పారు. హుజురాబాద్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, హుజురాబాద్ అభివృద్ధి కోసమే తాను పాటుపడతానని పేర్కొన్నారు. ప్రజలకు ఎన్నికలు సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం ఏది ఉన్నప్పటికీ హుజురాబాద్ కు కావలసినవన్నీ కొట్లాడి మరి సాధించుకుంటానని హామీనిచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అమలు చేయాలని కోరారు.
సంక్షేమ పథకాల అమలుతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉందన్నారు. హుజురాబాద్ అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందే రాధిక, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.