•  రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

వేద న్యూస్, వరంగల్ జిల్లా :

జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుంచి మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించిన దరఖాస్తులు పకడ్బందీగా స్వీకరించాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , రాష్ట్ర అటవీ శాఖ, పర్యావరణ , దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు , ఎస్పీ లు, అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజాపాలన గ్రామ,వార్డు సభల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు చేరువగా పాలన అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని , డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు పని దినాలలో జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలలోని ప్రతి వార్డులలో సభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం తేవడంలో అదే సహకారం ప్రభుత్వ అధికారులు సిబ్బంది కొనసాగించాలని మంత్రి కోరారు. ప్రజాపాలన గ్రామ సభ నిర్వహణ సమయంలో ప్రతి దరఖాస్తుదారుని 4 నుంచి 5 నిమిషాల కేటాయించాలని అన్నారు. ప్రజాపాలన గ్రామ సభకు మున్సిపల్ వార్డుల్లో నిర్వహించే సభకు వచ్చే దరఖాస్తు ద్వారా ఆయనకి రూపాయి ఖర్చు కాకుండా చూడాలని, జిరాక్స్ వారు కూడా ఎక్కువ మొత్తం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు .

మహాలక్ష్మి , రైతు భరోసా, చేయూత, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు మొదలగు పథకాలకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, ప్రతి గ్రామానికి దరఖాస్తులు ఒకరోజు ముందుగానే వస్తాయని, గ్రామ ప్రజలకు ముందుగానే దరఖాస్తులు అందించాలని, దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని, గ్రామంలోని నిరక్షరాస్యులకు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు దరఖాస్తు నింపడంలో సహకరించేలా చూడాలని అన్నారు.

గ్రామసభల నిర్వహణకు సంబంధించిన షెడ్యూలు అందించడం జరుగుతుందని, ప్రజాపాలన నిర్వహణపై మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందించుకోవాలని, ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపల్ వార్డులో ప్రజా పాలన సభ ఎప్పుడు నిర్వహిస్తున్నామనేది ప్రజలకు తెలియజేయాలని, మున్సిపాలిటీ లలో పారిశుద్ధ్య సిబ్బందిచే ప్రచారం చేయాలని మంత్రి సూచించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేసే కార్యాచరణ ప్రభుత్వం ప్రారంభించిందని, అర్హులందరికీ పథకాలు వర్తింప చేసేందుకు ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు.

ప్రజాప్రాలన గ్రామసభల సమయంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల తో పాటు ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని పరిశీలించి జిల్లా యంత్రాంగం పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. గ్యారెంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయాలని మంత్రి అన్నారు.

ప్రభుత్వ లక్ష్యాల సాధించడంలో ఉద్యోగులు అధికారులు కీలకపాత్ర పోషిస్తారని, ప్రజా పాలన విజయవంతంగా అమలు కావడానికి ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా ఉద్యోగులు పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకుని రావాలని, అధికారులు చాలెంజ్గా తీసుకొని పనిచేయాలని అన్నారు.

అనంతరం
సమావేశంలో పాల్గొన్న వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ ప్రతి మండలం పరిధిలో తహసిల్దార్, ఎంపీడీవో ఆధ్వర్యంలో రెండు బృందాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందం రోజుకు రెండు గ్రామాల చొప్పున పర్యటించి, ప్రతిరోజు ప్రతి బృందం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షెడ్యూల్లో గ్రామసభ నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు.
ప్రజాపాలన సభలలో పాల్గొనే సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు.

 

ప్రజాపాలన సభ నిర్వహణకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని త్రాగునీరు, కుర్చీలు, అవసరమైన బల్లలు ఏర్పాటు చేయాలని, ప్రతి 100 కుటుంబాలకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించాలని, ఆధార్, రేషన్ కార్డు జత చేసేలా చూడాలని అన్నారు.

ప్రభుత్వం నుంచి దరఖాస్తు ఫారంలు అందిన వెంటనే మండలాలకు పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జెడ్పీ సీఈఓ ను ఆదేశించారు. ప్రతిరోజు ప్రజాపాలన సభలలో తీసుకునే దరఖాస్తులను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయాలని, దరఖాస్తుదారునికి రసీదు అందించాలని, ప్రజాపాలన సభ నిర్వహణకు స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని, వారిని భాగస్వామ్యం చేయాలని కలెక్టర్ తెలిపారు.

ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డులో ప్రజాపాలన సభల నిర్వహణకు ఇంచార్జి లను ఏర్పాటు చేయాలని, గ్రామ సభలలో ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేయాలి, కౌంటర్లలో ఎవరు విధులు నిర్వహించాలని మొదలు కొని ప్రతి అంశం ప్రణాళిక బద్ధంగా జరిగేలా చూడాలని, సంబంధిత సిబ్బందికి ముందస్తుగానే విధులు అప్పగిస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

గ్రామసభలలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద క్యూలైన్ విధానం పాటించేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మేర పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ అన్నారు.

మండల స్థాయి సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రజాపాలన నిర్వహణ పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ అన్నారు. ప్రజాపాలన గ్రామసభ నిర్వహించే ప్రదేశం, సమయం, వివరాలు ముందస్తుగా ప్రచారం చేయాలని, స్థానిక జడ్పిటిసి, ఎంపిటిసి సర్పంచ్, మొదలగు నాయకులకు తప్పనిసరిగా ఎంపీడీవో లేదా తహసిల్దార్ ఫోన్ ద్వారా సమాచారం అందజేయాలని అన్నారు. గ్రామసభ నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కార్యక్రమంలో ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ , ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి , కె. ఆర్.నాగరాజు, వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, జిల్లాల కలెక్టర్లు పి. ప్రావీణ్య, సిక్తా పట్నాయక్ , శశాంక, జి డబ్ల్యుఎంసి కమిషనర్ రిజ్వాన్ బాషా షేక్ , అదనపు కలెక్టర్లు పర్మర్ పింకేశ్, లలిత్ కుమార్, శ్రీజ , తదితరులతో పాటు ఎస్పీలు సంగ్రామ్ సింగ్ జి పాటిల్ , గౌస్ ఆలం, కిరణ్ కారే తదితరులు పాల్గొన్నారు.