- జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు
- జిల్లా అధికారులకు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాలు
- కలెక్టరేట్లో భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగే జాతర ఏర్పాట్లపై సమీక్ష
- పాల్గొన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు
వేద న్యూస్, వరంగల్ ప్రతినిధి:
వచ్చే నెలలో భూపాలపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలల్లో జరిగే సమ్మక్క – సారలమ్మ ‘‘మినీ మేడారం’’ జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం త్వరితగతిన అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా అధికారులను ఆదేశించారు.

మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్లో జాతర ఏర్పాట్లపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.
జాతరకు వచ్చే భక్తుల తాగు నీరు, విద్యుత్, బస్సు సౌకర్యాలు కల్పించాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంత వాతావరణంలో సమ్మక్క – సారలమ్మ లను దర్శనం చేసుకునేలా చూడాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు.