వేద న్యూస్,ఎలిగేడు:
రాఖీ పండుగ వచ్చిందంటే చాలు సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టాలని ఎంతగానో ఆరాటపడుతుంటారు… అందరిలానే ఓ చెల్లి కూడా తన అన్నకు రాఖీ కట్టేందుకు ఆనందంగా తన పుట్టింటికి వెళ్లింది.
అయితే అత్యంత విషాదకర రీతిలో మృతదేహానికి రాఖీ కట్టాల్సి వచ్చింది. చూసినవారందరినీ దు:ఖానికి గురిచేసున్న ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది.పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టకి చెందిన చౌదరి కనకయ్యకు రాఖీ కట్టేందుకు చెల్లె గౌరమ్మ ఇంటికి వచ్చింది.
అప్పటిదాకా చెల్లెతో సంతోషంగా గడిపిన కనకయ్య ఒక్కసారిగా గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆపై క్షణాల వ్యవధిలో కన్నకయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో సంతోషంగా తన అన్నయ్యకు రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లికి అంతులేని విషాదం మిగిలింది. చివరకు అన్నయ్య మృతదేహానికే సోదరి రాఖీ కట్టి తన ప్రేమను చాటుకుంది. ఇద్దరి మధ్య ఉన్న అనురాగాన్ని చూసినవారంతా కన్నీటి పర్యంతమయ్యారు.