వేద న్యూస్, డెస్క్ :

దేశ రాజకీయాల్లో డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ సేవలు మరువలేనివని, ఆయన స్ఫూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ భవన్‌ను సీఎం తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జగ్జీవన్‌రామ్ నిలువెత్తు చిత్రపటానికి సీఎం పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్, ఇళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు విడివిడిగా ఉండేవని, ప్రస్తుతం దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి, కులాల మధ్య అంతరాలు చెరిపేయాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. అందుకోసం పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో శంకుస్థాపన చేశామని సీఎం చెప్పారు.

చదువు మీద పెట్టేది ఖర్చు కాదు పెట్టుబడని, విద్యార్థులు బాగా చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం వచ్చాయని ఆయన అన్నారు.

లోక్‌సభ స్పీకర్‌గా తెలంగాణ బిల్లును ఆమోదించింది జగ్జీవన్‌రామ్ కూతురు మీరాకుమారి అని, తెలంగాణ రాష్ట్రమంతా ఆమెను ఎప్పుడూ గుర్తు చేసుకుంటుందని కొనియాడారు.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఒకసారి దొరల చేతిలో ఉంటే, ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుందన్నారు. దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా అసెంబ్లీలో గడ్డం ప్రసాద్‌ను అధ్యక్షా అని పిలవాల్సిందేనని సీఎం రేవంత్ తెలిపారు.

కొందరు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారని, అసలు ఆ ప్రశ్నించే హక్కు, అధికారం కల్పించింది కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, చదువే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.