వేద న్యూస్, వరంగల్:
‘వారసుడి న్యాయపోరాటం’, ‘న్యాయపోరాటానికి పెరుగుతున్న మద్దతు’ శీర్షికలతో ‘‘వేద న్యూస్’’ తెలుగు దినపత్రిక ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనాలకు స్పందన వచ్చింది. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి(హవేలి)లో తన తండ్రి ఆస్తిలో వాటా కోసం తనయుడు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. తల్లితో కలిసి ఊరిలో టెంట్ వేసుకుని తండ్రి ఫొటోతో నిరసన తెలుపుతున్నాడు.
వివరాల్లోకెళితే.. ఎలుకుర్తి గ్రామవాస్తవ్యులు మిట్టపల్లి రాజేశ్వర్కి ముగ్గురు కుమారులు.. పెద్ద కుమారుడు కరుణాకర్, రెండో కుమారుడు శ్రీనివాస్, మూడో కుమారుడు రాజు. కాగా, 17 ఏళ్ల క్రితం మిట్టపల్లి శ్రీనివాస్ చనిపోయారు. తన కుమారుడైన మిట్టపల్లి అరవింద్.. తన తల్లి స్వరూపతో కలిసి తమకు రావలసిన ఆస్తి కోసం ధర్నా చేస్తున్నాడు. గ్రామపంచాయతీ ఆఫీసు ఎదుట అరవింద్ చేస్తున్న ధర్నా మంగళవారానికి (9వరోజుకు) చేరింది. అరవింద్ న్యాయపోరాటానికి విజిలెన్స్ కమిటీ మెంబర్ నమిండ్ల చిన్నస్వామి, భీమగాని సౌజన్య మద్దతు తెలిపారు. తాజాగా ముదిరాజ్ కులసంఘం పెద్దలు అరవింద్కు అండగా నిలిచారు.
తండ్రి వారసత్వంగా అరవింద్కు రావాల్సిన ఆస్తిని వాటా ప్రకారం ఇప్పిస్తామని ముదిరాజ్ కుల పెద్దలు హామీ ఇవ్వడంతో .. అరవింద్ ధర్నా విరమించారు. అనంతరం కుల సంఘం పెద్దలు పెద్ద సంఖ్యలో మిట్టపల్లి అరవింద్ నానమ్మ ఇంటికి తీసుకెళ్లారు. తాళం వేసి ఉన్న ఇంటిని పగులగొట్టి అందులో ఉండాలని సూచించారు. కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసరాలను అందజేశారు.
కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమగాని సౌజన్య, ముదిరాజ్ కుల సంఘం పెద్ద మనిషి బోయిన శ్రీను, బుసాని రఘు, బోయిన రాములు, దమ్మన్నపేట ముదిరాజ్ కుల సంఘం పెద్దలు పి.నాగరాజు, రాజేందర్, బాలయ్య, కట్టమల్లు, ఎన్హెచ్ఆర్సీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దుబాసి నవీన్ తదితరులు పాల్గొన్నారు.