- జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ మొండయ్యకు వినతి
వేద న్యూస్, కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజు మినహాయించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ శ్రీరామ్ మొండయ్యకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బాపురావు మాట్లాడుతూ… జర్నలిస్టులు సరైన వేతనాలు లేక కనీస ఉద్యోగ భద్రత లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనేక మంది జర్నలిస్టులు విద్యార్థుల ఫీజులు చెల్లించలేని పరిస్థితులలో ఉన్నారన్నారు. జిల్లాలో అనేకమంది విలేకరులు జర్నలిజంలో నిబద్ధతతో పని చేస్తున్నారన్నారు.
ఈ పరిస్థితుల్లో గుర్తింపు పొందిన జర్నలిస్టు పిల్లలకు జిల్లాలోని అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విద్యా ఫీజు మినహాయింపు కల్పించాలని కోరారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందించే విధంగా ఆదేశాలు జారీ చేసి జర్నలిస్టులకు అండగా నిలవాలని డిఈవో కు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయం పై డిఈవో సానుకూలంగా స్పందించి జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నల్లగొండ సత్తయ్య, కొమ్ము గణేష్, జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ శంకర్, జర్నలిస్ట్ నాయకులు గౌతమ్, జి నరేష్, సుదర్శన్ రెడ్డి, ఆర్ శంకర్ రెడ్డి, జి కిరణ్, దీక్షిత్, తిరుపతి, ఎం సతీష్, ఏ అనిల్, తదితరులు పాల్గొన్నారు.